ఎన్డీ టీవీ ప్రసారాలు బ్యాన్: దేశ భద్రత విషయం
న్యూఢిల్లీ: పఠాన్ కోట్ ఎయిర్ బేస్ మీద పాక్ ఉగ్రవాదులు జరిపిన దాడిపై ప్రసారం చేసిన ఎన్డీటీవీ ఇండియా న్యూస్ చానల్ ప్రసారాలను ఒక్క రోజు నిలిపివేయాలని ఇచ్చిన ఆదేశాలపై ప్రతిపక్షాలు, మీడియా సంస్థలు మండిపడుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు చూస్తుంటే ఎమర్జెన్సీ రోజులు గుర్తుకు వస్తున్నాయని అంటున్నారు. సమాచార ప్రసార శాఖకు చెందిన అంతర్ మంత్రిత్వ శాఖ విచారణ బృందం ఆదేశాలపై దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఎన్డీటీవీ ప్రసారాలు నిలిపివేయాలని ఇచ్చిన ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా బ్రాడ్ కాస్ట్ ఎడిటర్స్ అసోసియేషన్ ఖండించింది. ఐబీ తీసుకున్న నిర్ణయం పత్రికా స్వేచ్చను ఉల్లంఘించడమే అని వ్యాఖ్యానించింది.
ఎన్డీ టీవీ ప్రసారాలు బ్యాన్: పఠాన్ కోట్ దెబ్బ !
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని చూస్తుంటే దేశంలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు మళ్లీ వస్తున్నాయా ? అని అనుమానం వస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.
భారతదేశంలో దిగ్బ్రాంతికర పరిణామాలు ఎదురౌతున్నాయని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. అదే విధంగా పలు రాజకీయ పార్టీల నాయకులు, మీడియా ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మండిపడుతున్నారు.
ఇది మొదటి సారి కాదు... గతం చూడండి
ఎన్డీటీవీ తన కేబుల్ ఆక్ట్ ను ఉల్లంఘించడం ఇది మొదటి సారి కాదని సమాచార ప్రసార శాఖకు చెందిన అంతర్ మంత్రిత్వ శాఖ విచారణ బృందం అంటుంది. ఇది దేశ రక్షణకు సంబంధించిన విషయం.
అందుకే 30 రోజుల పాటు ఆ ప్రసారాలను క్షుణ్ణంగా పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నామని అంటున్నారు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ మీద ఉగ్రదాడి జరిగిన సమయంలో ఎన్డీ టీవీ ప్రసారం చేసిన విషయం అంత తేలికగా తీసుకునేది కాదని గుర్తు చేశారు.
పఠాన్ కోట్ ఎయిర్ బేస్, ఆయుధాలు ఉన్న ప్రాంతం, పాఠశాల పరిసరాలు, క్వాటర్స్ తదితర సున్నితమైన ప్రాంతాలను ఎన్డీటీవీ ప్రసారం చేసిందని గుర్తు చేశారు. ఇలాంటి ప్రసారాలు దేశ భద్రతకు ముప్పు అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
2005లో యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో ఇలాంటి ఆదేశాలు 21 సార్లు ఇచ్చిందని గుర్తు చేశారు. కేబుల్ ఆక్ట్ ఉల్లంఘనకు పాల్పడిన వివిధ టీవీ చానల్స్ కు యూపీఏ ప్రభుత్వం ఇలాంటి ఆదేశాలు ఇచ్చిందని అన్నారు.
ఇలాంటి సున్నితమైన ఘటనలు ప్రసారం చేసినందుకు ఒక్క రోజు నుంచి రెండు నెలల పాటు టీవీ ప్రసారాలు నిలిపివేసే అవకాశం ఉందని, ఆ చట్టం మనకు ఉందని వారు అంటున్నారు. అయితే ఈ విషయంలో తాము మళ్లీ ఆలోచించే అవకాశం లేదని సమాచార ప్రసార శాఖ అధికారులు అంటున్నారు.