'రూ.30వేల కోట్ల స్కాం.. ఆధారాలున్నాయి... మోడీని విచారించే సమయం వచ్చింది'
Recommended Video
న్యూఢిల్లీ: రాఫెల్ డీల్కు చెందిన కీలక పత్రాలు చోరీకి గురయ్యాయని సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం తరఫున అడ్వోకేట్ జనరల్ తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్, ఆ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు గురువారం ట్విట్టర్లో వరుస ప్రశ్నలు కురిపించారు.
కీలక పత్రాలు చోరీ: రాఫెల్ ఇష్యూలో సుప్రీం కోర్టులో బాంబుపేల్చిన అటార్నీ జనరల్
రూ.30,000 కోట్ల స్కాంకు కారణమైన వ్యక్తిపై విచారణ ఉండదా?
ఓ వైపు రాఫెల్ డీల్కు సంబంధించిన కీలక పత్రాలు పోయాయని కేంద్రం చెబుతోందని, మరోవైపు, ఈ అంశంపై ప్రధాని కార్యాలయం గతంలో సమాంతర చర్చలు జరిపిందని అన్నారు. కీలకమైన డాక్యుమెంట్లు మిస్ కావడంపై ఎవరి పైన అయినా చర్యలు తీసుకోవాల్సిందేనని, అదే సమయంలో చర్చలు జరిపినందుకు గాను పీఎంవో పైన కూడా విచారణ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రాఫెల్ ఫైల్స్ కనిపించకుండా పోయాయని చెబుతున్నారని, కాబట్టి మీడియాపై విచారణ జరుపుతామని చెబుతున్నారని, కానీ రాఫెల్ డీల్ వ్యవహారంలో రూ.30,000 కోట్ల స్కాంకు కారణమైన వ్యక్తిని మాత్రం విచారించరా అని ప్రశ్నించారు. అలాంటి వ్యక్తిపై ఎలాంటి విచారణ ఉండదా అన్నారు.
మోడీ బైపాస్ సర్జరీ చేశారు
రాఫెల్ ఫైల్స్ మిస్సైన అంశంలో మీడియాను కూడా విచారించాలని ప్రభుత్వం చెబుతోందని, కానీ ఆ డీల్లో 30 వేల కోట్లు చోరీ చేసిన వ్యక్తిని కూడా విచారించాలని రాహుల్ గాంధీ అంతకుముందు మీడియా ఎదుట కూడా డిమాండ్ చేశారు. ఆ అవినీతికి సంబంధించి ఆధారాలు ఉన్నాయని చెప్పారు. రహస్య పత్రాల్లో ఉన్న వ్యక్తులను విచారించాలన్నారు. మోడీని రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారన్నారు. రాఫెల్ ఒప్పందాన్ని రూటు మార్చేందుకు మోడీ బైపాస్ సర్జరీ చేశారని ఆ రహస్య పత్రాల్లో ఉందని, మరి ఆ పత్రాల ప్రకారం మోడీని కూడా దర్యాప్తు చేయాలన్నారు. పత్రాలను మాయం చేయడమే మోడీ సర్కారు పని అన్నారు. రాఫెల్ డీల్లో మోడీ సమాంతరంగా చర్చలు నిర్వహించారని గల్లంతు అయిన పత్రాలు ఉన్నట్లు చెప్పారు. అనిల్ అంబానీకి లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతోనే రాఫెల్ విమానాల అప్పగింత ఆలస్యంగా మారుతోందన్నారు.
మీడియాకు ఆ సత్తా ఉంది
మోడీ దారుణమైన అవినీతికి పాల్పడ్డారని, సమాంతర డీల్ జరిపిన మోడీ పైన క్రిమినల్ విచారణ ఎందుకు చేపట్టరని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మోడీని వ్యతిరేకిస్తున్న వారిపైనే దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఒకవేళ ఈ డీల్లో మోడీ తప్పులేకుంటే, మరెందుకు ఆయన విచారణకు హాజరకావడం లేదని నిలదీశారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎందుకు ఏర్పాటు చేయలేదని నిలదీశారు. మీడియా ధైర్యంగా ముందుకు వెళ్తుంది కాబట్టే, వారిని విచారించాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. మోడీకి వ్యతిరేకంగా నిలబడే సత్తా మీడియాకు ఉందని కితాబిచ్చారు.
ప్రధానిపై ఎఫ్ఐఅర్కు సమయం వచ్చింది
కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్రంపై విమర్శలు గుప్పించింది. రాఫెల్ యుద్ద విమానాల ఒప్పందంలో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించింది. ఈ వ్యవహారానికి సంబంధించి ప్రధాని మోడీపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రఫేల్ ఒప్పందానికి సంబంధించి అవినీతి, అక్రమాలు వెలుగుచూశాయి. డసో ఏవియేషన్కు లబ్ధి చేకూర్చడానికి ప్రధాని మోడీ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని, ఖజానాకు నష్టం కలిగించారన్నారు. ఇది అవినీతి నిరోధక చట్టం 1988 సెక్షన్ 13 (1) (డి), భారత శిక్షా స్మృతిలోని వివిధ విభాగాల ప్రకారం నమోదు చేయదగిన కేసు అని, ప్రధాని మోడీతో పాటు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. అప్పుడే రాఫేల్ అవినీతి వ్యవహారంలో నిర్దిష్ట కాలపరిమితితో కూడిన దర్యాప్తు జరుగుతుందన్నారు.