మాజీ ఉప కులపతి హత్య: శవమైన హంతకుడు (ఫోటోలు)
బెళగావి: మాజీ ఉప కులపతి, ప్రొఫెసర్ ఎం.ఎం. కలబుర్గి హత్య కేసులో సీబీఐ, కర్ణాటక, మహారాష్ట్ర పోలీసులకు చుక్కలు చూపిస్తూ తప్పించుకుని తిరిగిన రుద్ర పాటిల్ (32) హత్యకు గురైనాడు. అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు వివిద కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు.
కర్ణాటకలోని బెళగావి సమీపంలో రుద్రపాటిల్ రూపురేఖలు ఉన్న వ్యక్తి శవమై కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు.
మహారాష్ట్రలోని సాంగ్లీ ప్రాంతానికి చెందిన రుద్ర పాటిల్ కర్ణాటకకు చెందిన మాజీ ఉప కులపతి ఎం.ఎం. కలబుర్గిని కాల్చి చంపారని పోలీసులు చెప్పారు. అదే విదంగా నరేంద్ర ధాబోల్కర్, గోవింద పన్సార్ ల హత్యకు రుద్ర పాటిల్ కుట్రపన్నాడని పోలీసులు అన్నారు.
రుద్ర పాటిల్ కోసం కర్ణాటక, మహారాష్ట్ర పోలీసులు చాల కాలం నుంచి గాలిస్తున్నారు. అయితే కర్ణాటకలోని బెళగావి జిల్లా ఖానాపుర తాలుకా, మాణికవాడి గ్రామం (కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు)లో రుద్ర పాటిల్ శవమై కనిపించాడు.
అతని చాతి, కడుపుతో పాటు శరరీంలో మరో చోట మూడు బుల్లెట్ గాయాలైనాయి. ఇతనిని రివాల్వర్ తో కాల్చి చంపేశారని బెళగావి జిల్లా ఎస్పీ రవికాంత్ గౌడ అనుమానం వ్యక్తం చేశారు. రుద్ర పాటిల్ కోసం ఎన్ఐఏ, సీబీఐ అధికారులు గాలిస్తున్నారు.
సాంగ్లీకి చెందిన రుద్ర పాటిల్ అక్రమంగా మారణాయుధాలు, పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్నాడని కేసు నమోదు చేసిన ఎన్ఐఏ అధికారులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. 2015 ఆగస్టు 30వ తేదిన దారవాడలోని కళ్యాణ నగర్ లోని ఇంటిలో ఎం.ఎం. కలబుర్గి హత్యకు గురైనారు.
తుపాకితో కాల్చి కలబుర్గిని హత్య చేసిన నిందితుల ఆచూకి చెప్పినా, వారిని పట్టించినా రూ. 5 లక్షలు బహుమానంగా ఇస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. ఇదే కేసులో పోలీసులు రుద్ర పాటిల్ ఫోటోలు విడుదల చేసి ఇతనే హత్య చేశాడని చెప్పారు.
కలబుర్గి హత్యకు గురైన రోజు రుద్ర పాటిల్ బెళగావిలో ఉన్నాడని సీఐడి అధికారులు తేల్చి చెప్పారు. ఇప్పుడు అదే బెళగావి జిల్లాలో రుద్ర పాటిల్ హత్యకు గురి కావడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే హత్యకు గురైయ్యింది రుద్ర పాటిల్ అని అంటున్న పోలీసులు అధికారికంగా దృవీకరించ వలసి ఉంది.