ప్రతిష్టాత్మక పద్మశ్రీ వచ్చే.. కానీ జీవనోపాది పాయే..! ఒడిశాలో విచిత్ర సంఘటన..!!
భువనేశ్వర్/హైదరాబాద్ : మంచి చేస్తే చెడు ఎదురు రావడం అంటే ఇదే..మంచి మనసుతో, నిస్వార్థంగా పది మందికీ ఉపయోగపడే పని చేసిన దైతరి నాయక్ (71) ఇప్పుడు చాలా బాధపడుతున్నారు. పర్వత శ్రేణుల్లోని జల ప్రవాహాన్ని తన స్వగ్రామానికి తీసుకురావడానికి ఆయన మూడు కిలోమీటర్ల మేరకు కాలువ నిర్మించారు. కుటుంబ పోషణకు కూలి చేసుకుంటూ, ఖాళీ సమయాల్లో ఈ కాలువను చిన్న పలుగు, చిన్న పార సహాయంతో నిర్మించారు.
అనేక సంవత్సరాలపాటు మొక్కవోని దీక్షతో ఈ కాలువను నిర్మించిన ఆయన గొప్పతనాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనకు 'పద్మశ్రీ' పురస్కారాన్ని ఇచ్చి, సత్కరించింది. 'పద్మశ్రీ' పురస్కారమే తనకు శాపంగా మారిందని దైతరి నాయక్ చెప్పారు. ప్రభుత్వ గుర్తింపు రాకముందు తాను వ్యవసాయ పనులకు వెళ్ళి, తన కుటుంబాన్ని పోషించుకునేవాడినని చెప్పారు. ప్రస్తుతం తనను వ్యవసాయ పనులకు ఎవరూ పిలవడం లేదన్నారు. దీంతో తన రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి సైతం కష్టంగా ఉందని వాపోయారు.
'ఒడిశా కాలువ మనిషి' గా ప్రసిద్ధి పొందిన 'పద్మశ్రీ' దైతరి నాయక్ ప్రస్తుతం మామిడి పండ్లు అమ్ముకుంటూ జీవిస్తున్నారు. ఆయనకు మరో ఆవేదన కూడా ఉంది. తాను నిర్మించిన కాలువను అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఆ హామీ ఇప్పటికీ నెరవేరడం లేదని ఆయన తెలిపారు. కేందుఝర్ అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తనకు ప్రభుత్వం ఇచ్చిన 'పద్మశ్రీ' ని తిరిగి ఇచ్చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు.
కేందుఝర్ సబ్ కలెక్టర్ సోమనాథ్ ప్రధాన్ మాట్లాడుతూ 'పద్మశ్రీ' ని తిరిగి ఇచ్చేయవద్దని తాను దైతరి నాయక్ను కోరానని తెలిపారు. ఈ పురస్కారానికి ఆయన అర్హుడని తెలిపారు. నాయక్ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉన్నందు వల్ల ఆయనకు సహాయపడటానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఆయనకు పక్కా ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు.