ప్రియాంకా ఎఫెక్ట్: పొత్తులపై పునరాలోచనలో పడ్డ ఎస్పీ బీఎస్పీ..కాంగ్రెస్ను చేర్చుకుంటారా..?
లక్నో: కాంగ్రెస్ ప్రధాని కార్యదర్శిగా ప్రియాంకా గాంధీ నియామకం జరగగానే ఉత్తర్ ప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం కనిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో కేంద్రం ప్రభుత్వంను డిసైడ్ చేయడంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం కీలకంగా వ్యవహరించనున్న నేపథ్యంలో అక్కడి రాజకీయాలు ఆసక్తకరంగా మారాయి. ఇప్పటికే సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలు పొత్తుతో వెళుతున్న నేపథ్యంలో ప్రియాంకా ఎంట్రీతో వారు పునరాలోచనలో పడ్డట్లు సమాచారం.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంకా గాంధీ రంగప్రవేశం చేయడంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ క్యాడర్లో జోష్ను రావడం ఓ వైపైతే... మరోవైపు ఇతర రాజకీయ నాయకులను కూడా ఆలోచింపజేస్తోంది. వారి వ్యూహాలపై మరోసారి పునరాలోచిస్తున్నట్లు సమాచారం. ప్రియాంకా గాంధీ ఎంట్రీ తర్వాత కాంగ్రెస్ పాత్ర ఎలా ఉండబోతోంది అనే దానిపై సమాజ్ వాదీ పార్టీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. బహుజన్ సమాజ్ వాదీ పార్టీ, సమాజ్ వాదీ పార్టీలు ప్రియాంకా గాంధీ రంగప్రవేశం తర్వాత కాంగ్రెస్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుందో అనేదానిపై చాలా దగ్గరగా పరిశీలిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో ఆమె ఎలా ప్రభావితం చేయగలదో కూడా వారు విశ్లేషిస్తున్నారు. అంతేకాదు కాంగ్రెస్ను కూడా తమతో కలుపుకుపోదామనే ఆలోచనలో ఎస్పీ బీఎస్పీలు ఉన్నట్లు తెలుస్తోంది.
తమ కూటమిలో కాంగ్రెస్ను కూడా చేర్చుకోవాలని భావిస్తే హస్తం పార్టీకి ఎస్పీ బీఎస్పీలు 12 సీట్లు కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 2009లో అన్ని స్థానాలకు పోటీచేసిన కాంగ్రెస్ అక్కడ 21 సీట్లలో విజయం సాధించింది. సమాజ్వాదీ పార్టీకంటే 2 తక్కువ సీట్లు సాధించింది. ఉత్తర్ ప్రదేశ్లో ఓట్లు చీలిక జరగకూడదనే పొత్తులపై ఎస్పీ బీఎస్పీ పార్టీలు పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. బీఎస్పీ ఛీఫ్ మాయావతితో కాంగ్రెస్ పార్టీ ఎలా వ్యవహరిస్తుందో అనేదానిపైనే ఆధారపడి ఉంటుందని బీఎస్పీ నేత ఒకరు వెల్లడించారు. మాయావతి ఒప్పుకుంటే అఖిలేష్ యాదవ్ కూడా కాంగ్రెస్తో జతకట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు.