అయోధ్య ముస్తాబు: రామమందిరం ఇలా సాక్షాత్కారం: కాలి నడకన: కాషాయమయం..జైశ్రీరామ్ నినాదాలు
అయోధ్య: ఇంకొన్ని గంటలు.. దశాబ్దాల నాటి కల సాకారం కానుంది. కోట్లాదిమంది హిందువుల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. శతాబ్దాల తరబడి నానుతూ వస్తోన్న రామమందిరం నిర్మాణానికి బుధవారం తొలి ఇటుక పడబోతోంది. శతాబ్దాల తరబడి, చరిత్రలో చిరకాలంగా నిలిచిపోయేలా అపురూప రామమందిరం మన కళ్ల ముందు సాక్షాత్కారం కానుంది. దీనికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. కరోనా ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ.. రామమందిరం నిర్మాణాన్ని కనులారా వీక్షించడానికి భక్తులు అయోధ్య చేరుకుంటున్నారు.
Recommended Video
ముస్తాబవుతోన్న అయోధ్య..
ఆలయ భూమిపూజ కార్యక్రమాన్ని పురస్కరించుకుని అయోధ్య సింగారించుకుంటోంది.. సరికొత్త అందాలను సంతరించుకుంటోంది. ఆధ్యాత్మిక సాగరంలో ఓలలాడుతోంది. భక్తిపూరక వాతావరణాన్ని అణువణువునా నింపుకొంటోంది. శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో ఎటు చూసినా కాషాయ జెండాలు దర్శనం ఇస్తున్నాయి. జైశ్రీరామ్ అనే నినాదాలు వినిపిస్తున్నాయి. సాధువులతో నగరం క్రమంగా నిండిపోతోంది. శ్రీరామచంద్రుడి భక్తులు ఒక్కొక్కరుగా అయోధ్యకు చేరుకుంటున్నారు. చాలామంది కాలి నడకన, చెప్పులు లేకుండా రావడం కనిపిస్తోంది. ఏ ఒక్కరిని పలకరించినా.. జైశ్రీరామ్ అంటూ సమాధానం ఇస్తున్నారు.
రామమందిర ఆలయ ఫొటోలు ఇవే..
ఇదిలావుండగా.. రామచంద్రుడి ఆలయ నిర్మాణం ఎలా ఉంటుందనే విషయంపై ఓ స్పష్టత ఏర్పడింది. రామమందిరం ఆలయ నమూనాను కొద్దిసేపటి కిందట శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర సభ్యులు విడుదల చేశారు. తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో వాటిని పోస్ట్ చేశారు. ఆలయ ప్రాకారం ఎలా ఉంటుంది? బయటి నుంచి రామమందిరం ఎలా కనిపిస్తుంది? ఆలయ లోపలి భాగాలు ఎలా ఉంటాయి? అనే విషయాలను స్పష్టం చేస్తూ.. ఈ ఫొటోలను విడుదల చేశారు తీర్థ క్షేత్ర సభ్యులు. భవిష్యత్తులో ఆలయం అచ్చంగా ఇలాగే నిర్మితమౌతుందని పేర్కొన్నారు.
150 మందికే ఆహ్వానం..
రామాలయం నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయబోతోన్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పరిమితంగా ఆహ్వాన పత్రికలను పంపించింది తీర్థ క్షేత్ర.150 మంది మాత్రమే ఈ కార్యక్రామనికి హాజరు కానున్నారు. మొదట్లో 200 మందిని ఆహ్వానించాలని నిర్ణయించుకున్నప్పటికీ.. కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఈ సంఖ్యను 150కి పరిమితం చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే బహిరంగ వేదికపైనా అయిదుమంది మాత్రమే ఆసీనులు అవుతారని తీర్థక్షేత్ర స్పష్టం చేసింది.