రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలు అంగీకరించలేదు: బెదిరిస్తున్నారని ఫిర్యాదు, కర్ణాటక స్పీకర్ !
బెంగళూరు: ప్రస్తుతానికి ఎవ్వరి రాజీనామాలు తాను అంగీకరించలేదని, ఇప్పటికే తాను ఇచ్చిన గడువు ప్రకారం రెబల్ ఎమ్మెల్యేలను విచారణ చేస్తానని కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. తముకు బెదిరింపులు రావడంతో ముంబై వెళ్లిపోయామని రెబల్ ఎమ్మెల్యేలు చెప్పారని స్పీకర్ రమేష్ కుమార్ అన్నారు.
రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేల మీద స్థానిక ప్రజలు ఫిర్యాదు చేశారని, ప్రజల కోరిక మేరకు వారిని గౌరవిస్తూ ఎమ్మెల్యేలను విచారణ చెయ్యాల్సి ఉందని స్పీకర్ రమేష్ కుమార్ చెప్పారు. ప్రాణ భయంతో తాము ముంబై వెళ్లామని రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు తనకు చెప్పారని స్పీకర్ రమేష్ కుమార్ అన్నారు.
రెబల్ ఎమ్మెల్యేల తీరుతో తన మనసు చాల భాదపడిందని కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ అన్నారు. గురువారం రాత్రి బెంగళూరులోని విధాన సౌధలో విలేకరులతో మాట్లాడిన స్పీకర్ రమేష్ కుమార్ తాను ఏకపక్షంగా వ్యవహరిస్తున్నానని రెబల్ ఎమ్మెల్యేలు ఆరోపించడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
తాను రాజీనామాలు అంగీకరించలేదని గవర్నర్ ను కలిశారని, కాని గవర్నర్ తిరిగి వారిని తన దగ్గరకే పంపించారని స్పీకర్ రమేష్ కుమార్ గుర్తు చేశారు. సుప్రీం కోర్టు సూచనల మేరకు రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలతో మాట్లాడి వారు ఎందుకు రాజీనామాలు చేశారు అని వివరాలు సేకరించానని అన్నారు.
ఐదు మంది రాజీనామాలు చట్టబద్దంగా ఉన్నాయని, 8 మంది రాజీనామాలు చట్టబద్దంగా లేవని, ఆ 8 మంది మరోసారి రాజీనామాలు చెయ్యడానికి అవకాశం ఇచ్చామని స్పీకర్ రమేష్ కుమార్ గుర్తు చేశారు. అయితే మూడు రోజులు ఆలస్యం అయ్యిందని రెబల్ ఎమ్మెల్యేలు ముంబైలో ప్రెస్ మీట్ పెట్టి తన మీద ఆరోపణలు చేశారని విచారం వ్యక్తం చేశారు.
చట్టపరంగా తాను వ్యవహరిస్తున్నానని, 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఎవ్వరి దగ్గర తాను ఒక్కమాట అనించుకోలేదని స్పీకర్ రమేష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి తాను ఎవ్వరి రాజీనామాలు అంగీకరించలేదని, విచారణకు హాజరుకావాలని ఇప్పటికే వారికి కేటాయించిన రోజు విచారణ చేస్తానని స్పీకర్ రమేష్ కుమార్ స్పష్టం చేశారు.
సంకీర్ణ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి రాజీనామాలు చేసిన రెబల్ ఎమ్మెల్యేలను స్పీకర్ రమేష్ కుమార్ విచారణ చేసి వివరాలు సేకరించారు. ఖాళీ లెటర్ హెడ్ లు తీసుకుని స్పీకర్ రమేష్ కుమార్ చాంబర్ చేరుకున్న రెబల్ ఎమ్మెల్యేలు ఆయన ముందే స్వచ్చందంగా రాజీనామా చేసి వారి సంతకాలు చేశారు.
గురువారం సాయంత్రం 6 గంటలలోపు స్పీకర్ ముందు హాజరుకావాలని రెబల్ ఎమ్మెల్యేలకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గడువులోపు రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ రమేష్ కుమార్ ముందు హాజరై తాము ఎందుకు రాజీనామాలు చెయ్యవలసి వచ్చిందో అని వివరణ ఇచ్చారు