‘రియో’ నాగా ‘పవర్’: ఈశాన్యంలో బలోపేతం దిశగా బీజేపీ మరో ముందడుగు
న్యూఢిల్లీ : నాగాలాండ్లో అతిపెద్ద నగరం దిమాపూర్కు వెళితే అక్కడ రోడ్డు పక్కన మూడంతస్తుల భవనం, ఆ భవనంపై 'నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ' అని రాసి ఉన్న బ్యానర్ కనిపిస్తుంది. అదే బ్యానర్పైన కొంత చిన్న అక్షరాలతో 'ప్యాక్టా నాన్ వెర్బా', అంటే మాటలు కాదు, చేతలు అనే నినాదం కనిపిస్తుంది. ఆ భవనంలోకి వెళ్లి చూస్తే మెల్లగా మాట్లాడుకుంటున్న ఓ గ్రూపు నాయకులు, కార్యకర్తలు మినహా మొత్తమంతా ప్రశాంతంగా కనిపిస్తోంది.మరో గదిలోకి వెళ్లే వారికి ఎంతో క్రమశిక్షణతో పని చేసే రిసెప్షన్ డెస్క్ ఆహ్వానం పలుకుతూ ఉంటుంది. ఇప్పుడిప్పుడే ప్రాణం పోసుకున్న పార్టీకి అది ప్రధాన కార్యాలయం. దీని వ్యవస్థాపకుడు రాష్ట్రానికి మూడుసార్లు సీఎంగా పని చేసిన నైప్యూ రియో. ఆయన నాగాలాండ్ రాష్ట్రంలోనే సీనియర్ రాజకీయ నేత అంటే అతిశయోక్తి కాదు. 2014 ఎన్నికల్లో సీఎంగానే పార్లమెంట్కు పోటీ చేసి విజయం సాదించారు.
కానీ సమీకరణాలు కుదరక కేంద్ర క్యాబినెట్ మంత్రిగా చోటు దక్కక రాష్ట్ర రాజకీయాలపై ద్రుష్టి పెట్టారు. మరోవైపు బీజేపీతో సంప్రదింపులు జరిపి నూతన పార్టీకి ప్రాణం పోశారు. ఈ నెల 27న జరిగే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఆయన సీఎం అయ్యాకే రాష్ట్రం అభివ్రుద్ది దిశగా ముందడుగు వేసిందన్న అభిప్రాయాల మధ్య వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రియో సారథ్యంలోని కూటమే విజయం సాధిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఎన్నికల షెడ్యూల్ వెలువడగానే రియో పార్టీలోకి వలసల వెల్లువ
2014 తర్వాత మారిన పరిస్థితుల్లో నైప్యూ రియో ప్రధానంగా రాష్ట్ర రాజకీయాలపైనే దృష్టి పెట్టారు. నాగాలాండ్ పాలకపక్ష ‘నాగా పీపుల్స్ ఫ్రంట్'లో కొనసాగిన రియో.. ఏడాది కాలంగా ఢిల్లీకే పరిమితమై జాతీయ బీజేపీ నాయకులతో ఎడతెరపి లేకుండా చర్చలు జరిపారు. గత నెలలోనే నాగాలాండ్కు వచ్చి నాగా పీపుల్స్ ఫ్రంట్కు గుడ్బై చెప్పారు. తద్వారా గత మే నెలలోనే స్థాపించిన నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ' అభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరించారు. ఇంతలో నాగాలాండ్ అసెంబ్లీకి ఈ నెల 27వ తేదీన అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. నాటి నుంచి నాగా పీపుల్స్ ఫ్రంట్ నుంచి రియో పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. గత శుక్రవారం నాడు ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరినట్లు రియో పార్టీ, బీజేపీ ప్రకటించినప్పటి నుంచి వలసలు మరీ ఊపందుకున్నాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు, రియో సంయుక్తంగా పొత్తుపై ప్రకటన చేశాయి. నాగాలాండ్ అసెంబ్లీలోని 60 సీట్లకు 40 సీట్లకు రియో పార్టీ, మిగతా 20 సీట్లకు బీజేపీ పోటీ చేయనున్నాయి.
2015 నుంచి విపక్షమే లేని నాగాలాండ్ అసెంబ్లీలో అడుగు పెట్టనున్న విపక్షం
నాగా పీపుల్స్ ఫ్రంట్ నాయకత్వంలోని ‘డెమోక్రటిక్ అలయెన్స్ ఆఫ్ నాగాలాండ్'కు రియో సారథ్యంలోని నేషనల్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ - బీజేపీ కూటమికి మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2015 నుంచి ప్రతిపక్షమే లేకుండా నడుస్తున్న నాగాలాండ్ అసెంబ్లీలో మళ్లీ ప్రతిపక్షం ప్రత్యక్షం కానున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. డెమోక్రటిక్ అలయెన్స్ ఆఫ్ నాగాలాండ్ ప్రభుత్వంలో మొదటి నుంచి బీజేపీ భాగస్వామిగా ఉండగా, ఎనిమిది ఎమ్మెల్యేలు గల కాంగ్రెస్ పార్టీ కూడా అలయెన్స్లో చేరిపోవడంతో 2015 నుంచి ఆ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేకుండా పోయింది. కాంగ్రెస్, బీజేపీలు పాలకపక్షంలో చేరిన అరుదైన రికార్డు నాగాలాండ్కు దక్కింది. ఇప్పుడు ఆ అలయెన్స్ను వీడి నాగా పీపుల్స్ పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్న రియో.. కొత్త పార్టీకి ప్రాణం పోయగా, ఎప్పటి నుంచో ఆయనతో తెరవెనక, తెర ముందు చర్చలు జరుపుతూ వస్తున్న బీజేపీ అలయెన్స్ను వీడి రియోతో చేతులు కలిపింది.
2003లో రియో సీఎం అయ్యాకే నాగాలాండ్ ప్రగతి
నాగాలాండ్లో శక్తివంతమైన ‘అంగామి నాగా' తెగకు చెందిన రియో ఉత్తర అంగామి-2 స్థానం నుంచి 2003లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి తొలిసారి రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2008, 2013లలో కూడా పోటీచేసి గెలవడమే కాకుండా మూడు సార్లు సీఎంగా పనిచేశారు. 2014లో డెమోక్రటిక్ అలయెన్స్ తరఫున పార్లమెంట్కు పోటీచేసి లోక్సభకు ఎన్నికయ్యారు. నాగాలాండ్కు ఏదైనా అభివృద్ధి జరిగిదంటే ఆయన తొలిసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత నుంచే అని రాష్ట్ర ప్రజలు చెబుతుంటారు. అయితే అభివృద్ధితోపాటు అవినీతి కూడా పెరిగిందని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. రియో ఆధ్వర్యంలో నాగాలాండ్లో కొత్త ప్రభుత్వ భవనాలు వచ్చిన మాట నిజమేగానీ వాటిలో అవినీతి జరగడమే కాక రాష్ట్రానికి అప్పులు కూడా పెరిగాయని విమర్శకుల మరొక ఆరోపణ. ‘రియో అవినీతి పరుడు కావచ్చు. పనులు మాత్రం చేస్తారు' అని సెయిరియో అనే ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్ చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకున్నందున రియో కూటమికే విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయని రాజకీయ విశ్లేషకుల అంచనా వేస్తున్నారు.