పొత్తులో భాగంగా ఎస్పీ- బీఎస్పీలు కాంగ్రెస్ను ఎందుకు విస్మరించాయి...లాజిక్ ఇదేనా..?
ఉత్తర్ ప్రదేశ్లో కాంగ్రెస్తో ఎస్పీ బీఎస్పీ ఎందుకు పొత్తు పెట్టుకోవడం లేదో బీఎస్పీ అధినేత్రి వివరణ ఇచ్చింది. అంతేకాదు కాంగ్రెస్కు రెండు స్థానాలను వదలడంపై కూడా బెహెన్జీ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్తో కలిసి పనిచేస్తే తమకు ఒరిగేదీ ఏమీ లేదని మాయావతి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్తో కలిసి పోటీచేయడం ఇంకా తమకే నష్టం చేకూరుస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ పొత్తను మరో కోణంలో చూస్తున్నారు.
బోఫోర్స్తో కాంగ్రెస్ అధికారం కోల్పోగా..రాఫెల్తో బీజేపీ ఓటమి ఖాయం: మాయావతి
ఉత్తర్ప్రదేశ్ రాజకీయాల్లో అఖిలేష్ మాయావతిలు పొత్తు పెట్టుకోవడం దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా జరుగుతోంది. అయితే కాంగ్రెస్ను వదిలి ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడం మరింత చర్చనీయాంశమైంది. అంతేకాదు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న అమేథీ, రాయ్బరేలీ స్థానాల్లో పోటీ చేయడం లేదని కూడా ప్రకటించింది. ఇందుకు గల కారణాలను కూడా బెహన్జీ వివరించారు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక దేశాన్ని, చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిపాలించిందన్నారు. అప్పటికీ కాంగ్రెస్పై పలు అవినీతి ఆరోపణలు వచ్చినా, దేశం పేదరికంలో మగ్గుతున్నా కూడా కాంగ్రెస్ను ప్రజలు ఆదరించారని మాయావతి చెప్పారు. ఇక బీజేపీ కూడా కాంగ్రెస్కు ఏమి తక్కువకాదని ధ్వజమెత్తారు మాయావతి.
డిఫెన్స్ రంగంలో రెండు పార్టీలు అవినీతి చేశాయని ఆమె ఆరోపించారు. బోఫోర్స్ కారణంగా కాంగ్రెస్ అధికారం కోల్పోగా... రాఫెల్ కారణంగా బీజేపీ అధికారం కోల్పోతుందని జోస్యం చెప్పారు మాయావతి. అంతేకాదు 2017లో సమాజ్వాదీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడంతో భారీగా నష్టపోయిందని మయావతి గుర్తుచేశారు. అయితే ఇద్దరు చెరో 38 సీట్లలో పోటీ చేయడం ద్వారా నరేంద్ర మోడీ తలరాతను మార్చగలం అనే విశ్వాసాన్ని మాయావతి వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్తో పొత్తు వల్ల మాకే నష్టం: మాయావతి
ఇక కాంగ్రెస్తో గతంలో పొత్తుతో వెళ్లడం వల్ల తమకు ఎలాంటి లాభం చేకూరలేదని మాయావతి చెప్పారు. గతంలో కాంగ్రెస్తో పొత్తులో భాగంగా తాము పోటీచేసిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓటు తమ అభ్యర్థులకు బదిలీకాలేదని చెప్పిన మాయావతి.. బీఎస్పీ క్యాడర్కూడా కాంగ్రెస్ కాకుండా మరో పార్టీని ఆశ్రయిస్తున్నాడని చెప్పుకొచ్చారు. ఇది కాంగ్రెస్కు లాభిస్తుంది కానీ తమకు ఎలాంటి లాభం లేదని చెప్పారు. అంతేకాదు తమ ఓటుశాతం కూడా గణనీయంగా తగ్గిపోతోందని మాయావతి వ్యాఖ్యానించారు.
రాజకీయ విశ్లేషకులు పొత్తును ఎలా చూస్తున్నారు..లాజిక్ ఏంటి..?
ఇక మాయావతి అఖిలేష్ యాదవ్లు చెరో 38 సీట్లలో పోటీచేయడం వెనక ఉన్న లాజిక్ను రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో వివరిస్తున్నారు. ఇందులో రాజకీయంగా పెద్ద ఎత్తున అవగాహనలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. బీఎస్పీ ఎస్పీలు 76 స్థానాల్లో పోటీ చేసి రెండు స్థానాలను ఆర్ఎల్డీకి కేటాయించనున్నారు. అంతేకాదు రాజకీయంగా ఉత్తర్ప్రదేశ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి... ముందు రాష్ట్రం పై దృష్టి సారించి కేంద్రంలో బీజేపీని అధికారంకు దూరం చేసే బాధ్యత పరోక్షంగా కాంగ్రెస్ భుజాలపై వేసింది. ఇది రాజకీయంగా మంచి అడుగు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు ప్రస్తుతం ఎస్పీ బీఎస్పీల కలయికతో కాంగ్రెస్ ఒంటరిపోరు తప్పదు కాబట్టి బీజేపీ ఓటు బ్యాంకుకు హస్తం పార్టీ ద్వారా గండిపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.