బిగ్ ట్విస్ట్... 'షాహీన్బాగ్' ఆందోళనలు బీజేపీ ప్లానే... ఆమ్ ఆద్మీ సంచలన ఆరోపణలు...
కరోనా వైరస్కు ముందు పౌరసత్వ సవరణ చట్టం(CAA)పై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సీఏఏ వ్యతిరేక,అనుకూల వర్గాలుగా దేశంలోని రాజకీయ పార్టీలు,ప్రజా సంఘాలు,మేదావుల ప్రజల మధ్య స్పష్టమైన చీలిక కనిపించింది. కరోనా వైరస్ వ్యాప్తితో నెమ్మదిగా ఆ సమస్య తెరమరుగైంది. సీఏఏకి వ్యతిరేకంగా షాహీన్బాగ్ ఆందోళనల్లో పాల్గొన్న ముగ్గురు కీలక సామాజిక కార్యకర్తలు తాజాగా బీజేపీలో చేరడంతో మరోసారి ఈ అంశం తెర పైకి వచ్చింది. షాహీన్బాగ్ ఆందోళనలు బీజేపీ వ్యూహంలో భాగమేనని ఢిల్లీ అధికార పార్టీ ఆమ్ ఆద్మీ ఆరోపించడం కొత్త చర్చకు తెరలేపింది.
బీజేపీలో చేరిన ముగ్గురు షాహీన్బాగ్ యాక్టివిస్టులు...
సీఏఏని వ్యతిరేకిస్తూ షాహీన్బాగ్లో దాదాపు 100 రోజులకు పైగా ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 14,2019 నుంచి మార్చి 24 వరకూ ఈ ఆందోళనలు కొనసాగాయి. ఈ ఆందోళనల్లో పాల్గొన్న సామాజిక కార్యకర్తలు షహజాద్ అలీ,డా.మెహ్రీన్,తబస్సుమ్ హుస్సేన్ ఆదివారం(అగస్టు 16) బీజేపీలో చేరారు. ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తా ఆధ్వర్యంలో కాషాయ కండువాలు కప్పుకున్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ,ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొన్న కొద్ది నెలలకే ఈ ముగ్గురూ అదే పార్టీలో చేరడం గమనార్హం. పార్టీలో చేరిక తర్వాత షహజాద్ అలీ మాట్లాడుతూ... బీజేపీ ముస్లింలకు శత్రువు కాదని చెప్పేందుకే ఆ పార్టీలో చేరామన్నారు.
ఆమ్ ఆద్మీ సంచలన ఆరోపణలు...
తాజా పరిణామాలపై ఆమ్ ఆద్మీ ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 'షాహీన్బాగ్ బీజేపీ వ్యూహాల్లో ఒకటి... దాని వెనక ఉన్నది ఆ పార్టీనే.' అని సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీలో చేరిన ముగ్గురు యాక్టివిస్టులతో పాటు షాహీన్బాగ్ వద్ద నినాదాలు చేసినవారు,ఆందోళనల్లో పాల్గొన్నవాళ్లంతా కాషాయ పార్టీ మద్దతుదారులే అన్న తరహాలో వ్యాఖ్యలు చేశారు. భారత్కు వ్యతిరేకంగా షాహీన్బాగ్ వద్ద నినాదాలు చేసినవాళ్లను పోలీసులు అరెస్టు చేయకపోవడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు.
ఎన్నికల్లో లబ్ది పొందేందుకే... : ఆప్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో 'షాహీన్బాగ్'ను మాత్రమే తెరపై ఉంచి బీజేపీ లబ్ది పొందాలని చూసిందని... కానీ ఎన్నికల్లో మాత్రం గెలవలేకపోయిందని సౌరభ్ భరద్వాజ్ అన్నారు. 'షాహీన్బాగ్ వల్ల ఎవరు లబ్ది పొందారో అందరికీ తెలుసు. ఎన్నికల సమయంలో నీళ్లు,విద్యుత్,ఇతరత్రా సమస్యలేవీ చర్చకు రాకుండా కేవలం షాహీన్బాగ్ను మాత్రమే తెరపై కనిపించేలా చేశారు. ఏ సమస్యపై ఎవరు మాట్లాడాలో ఒక స్క్రిప్ట్ తయారుచేసుకున్నారు. షాహీన్బాగ్ని చూపించే హోంమంత్రి అమిత్ షా,యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఢిల్లీలో ఓట్లు అడిగారు.' అని సౌరబ్ భరద్వాజ్ అన్నారు.
Recommended Video
బీజేపీ గెలిచేందుకే...
'దేశం మొత్తానికి షాహీన్బాగ్తో ఏదో ముప్పు పొంచి ఉందన్న వాతావరణాన్ని సృష్టించారు. బీజేపీ గెలిస్తేనే అందుకు పరిష్కారం లభిస్తుందన్న ప్రచారం చేశారు. కానీ ఢిల్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయింది. షాహీన్బాగ్ వల్లే బీజేపీ ఓటు బ్యాంకు 18శాతం నుంచి 39శాతానికి పెరిగింది. షాహీన్బాగ్ పేరుతో అల్లర్లు చెలరేగడంతో 53 మంది చనిపోయారు.' అని సౌరభ్ భరద్వాజ్ చెప్పుకొచ్చారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తర్వాత షాహీన్బాగ్ ఆందోళనలు సద్దుమణిగాయన్నారు.