ఆకాశం బద్దలైనా పోటీ నుంచి తప్పుకోం..! మోదీ పై పోటీ చేస్తున్న రైతుల పట్టుదల..!!
వారణాసి/హైదరాబాద్ : నిజామాబాద్ మొండికేస్తున్నారు. భూమ్యాకాశాలు ఏకమైనా తమ పోరాటం ఆగదని భీష్మించుకున్నారు. పంటలకు మద్దతు ధర కల్పించకపోవడం, పసుపు బోర్డును ఏర్పాటు చేయకపోవడాన్నినిరసిస్తూ తెలంగాణలోని నిజామాబాద్ రైతులు వారణాసిలో ప్రధాని మోదీతో పాటు నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. వీరంతా వారణాసికి చేరుకుని నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే అక్కడి ప్రభుత్వ అధికారులు, పోలీసులు మాత్రం వీరిని అడుగడుగునా అడ్డుకుంటున్నారు.
జాతీయ స్థాయికి చేరిన రైతుల ఆందోళన..! ప్రధానిపై పోటీ చేసి తీరుతామంటున్న రైతులు..!!
వీరికి తోడుగా స్థానిక బీజేపీ నేతలు తెలంగాణ రైతులకు స్థానికంగా నామినీలు దొరకకుండా చేసేశారు. రైతులకు మద్దతు ఇచ్చే స్థానికులను బీజేపీ నేతలు బెదిరిస్తున్నారని రైతు నాయకుడు నర్సింహనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వ్యక్తి నామినేషన్ వేయాలంటే కొంతమంది స్థానికులు వారి పేర్లను ప్రతిపాదించాల్సి ఉంటుంది.
తెలుగు రైతులకు తోడైన తమిళ తంబీ రైతులు..! తగ్గేది లేదంటున్న రైతు సోదరులు..!!
తెలంగాణతో పాటు ఏపీ, తమిళనాడు రైతులు కూడా ప్రస్తుతం వారణాసిలో మోదీకి వ్యతిరేకంగా నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, తెలంగాణ, ఏపీ, తమిళనాడు రైతులను యూపీ ఇంటెలిజెన్స్ అధికారులు నీడలా వెంటాడుతున్నారు. తెలంగాణ తరహాలో భారీ సంఖ్యలో నామినేషన్ దాఖలు చేయడం ద్వారా తమ సమస్యలు జాతీయ స్థాయిలో వెలుగులోకి వస్తాయనీ, తద్వారా పరిష్కారం లభిస్తుందని ఆశగా ఉన్నారు.
అవాక్కవుతున్న యూపి పోలీసులు..! రైతులు నామినేషన్ ఏంటని ప్రశ్న..!!
కానీ యూపీ ఇంటెలిజెన్స్ అధికారులు మాత్రం.. మీరంతా ఎవరు?, ఇక్కడికి ఎందుకు వచ్చారు? లోక్ సభ ఎన్నికల్లో పోటీచేయాల్సిన అవసరం ఏంటి? మీరంతా రైతులా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని రైతు నేత నర్సింహనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులను కట్టడి చేస్తున్న పోలీసులు..! వారణాసి నుంచి పంపించేందుకు చర్యలు..!!
తాము వారణాసికి వచ్చినా తమిళ రైతులు రాకుండా అన్నాడీఎంకే ప్రభుత్వం ఆరుగురు రైతుల నేతలను అరెస్ట్ చేసిందన్నారు. అయినా వారంతా ఈరోజు సాయంత్రానికల్లా వారణాసికి చేరుకుంటారని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రధాని మోదీపై పోటీ చేసి తీరుతామని స్పష్టం చేస్తున్నారు రైతులు. నామినేషన్ల గడువు ముగిసే సమయానికి ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.