కళ్ల ముందే కుప్పకూలిన స్టేజీ: రాకేష్ తికాయత్ సహా: తృటిలో తప్పిన ప్రాణాపాయం
చండీగఢ్: మూడు వ్యవసాయ బిల్లులకు నిరసనగా దేశ రాజధానిని ముట్టడించిన రైతుల ఉద్యమానికి సారథ్యాన్ని వహిస్తోన్న భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ తికాయత్కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఆయనతో పాటు కొందరు రైతు నాయకులు ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. వారు ప్రసంగిస్తోన్న సమయంలో స్టేజీ కుప్పకూలింది. ఈ ఘటనలో తికాయత్ సహా మిగిలిన వారికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ ఘటన అనంతరం వారి ప్రసంగం యధాతథంగా కొనసాగింది.
జగన్ సర్కార్పై అమిత్ షానకు టీడీపీ ఎంపీల కంప్లైట్: అచ్చెన్న అరెస్టు..పట్టాభిపై దాడి
రైతు ఉద్యమంలో భాగంగా భారతీయ కిసాన్ యూనియన్ నాయకులు మహా పంచాయత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్నారు. పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్.. వంటి రాష్ట్రాల్లో దానికి అనుబంధంగా సభలు, సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. మహా పంచాయత్ సభలో పాల్గొనడానికి రాకేష్ తికాయత్ మరి కొందరు యూనియన్ నాయకులు బుధవారం మధ్యాహ్నం హర్యానాలోని జింద్కు చేరుకున్నారు. జింద్లో ఏర్పాటు చేసిన వేదికపైకి ఎక్కారు.
వేదిక సామర్థ్యానికి మించి భారీ సంఖ్యలో రైతు నేతలు, భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధులు దాని మీదికి ఎక్కి నిల్చున్నారు. వారి బరువును ఆ వేదిక మోయలేకపోయింది. చూస్తుండగానే కుప్పకూలిపోయింది. అక్కడ ఏం జరుగుతోందనేది కొద్దిసేపు ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. వెంటనే తేరుకున్న రైతులు.. కింద పడ్డ వారికి ఆసరా ఇచ్చారు. ఈ ఘటనలో రాకేష్ తికాయత్ సహా మిగిలిన వారికి స్వల్పంగా గాయాలయ్యాయి. అనంతరం వారు తమ ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వేదిక కుప్పకూలిందనే సమాచారం అందిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి పరుగులు తీశారు.