గోవాలో బీజేపీకి ఝలక్: అధికారంలోకి కాంగ్రెస్, ఏం చెద్దాం!
పనాజి: గోవాలో అధికారంలో ఉన్న బీజేపీకి స్థానిక ఓటర్లు ఝలక్ ఇచ్చారు. గోవాలో కాంగ్రెస్ పార్టీకి 17 స్థానాలు కట్టబెట్టారు. బీజేపీ 13 స్థానాలలో విజయం సాధించింది. ఇతరులు 10 స్థానాలు గెలుచుకున్నారు. గోవాలో అధికారంలో రావడానికి కాంగ్రెస్ పార్టీకి కేవలం నలుగురు ఎమ్మెల్యేలు (21) మద్దతు ఇస్తే సరిపోతుంది.
అయితే బీజేపీకి మద్దతు ఇవ్వడానికి కొందరు ఆసక్తి చూపిస్తున్నారు. గోవా సురక్షా మంచ్ నాయకుడు సుభాష్ వెలింగ్ కర్ తమ కూటమిలోని శివసేన, మహారాష్ట్ర గోమంతకర్ పార్టీ నాయకులకు బ్రేక్ వేస్తున్నారు. అయితే శివసేన ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు.
55 ఏళ్లు ఆర్ఎస్ఎస్ లో పని చేసిన గోవా సురక్షా మంచ్ నాయకుడు సుభాష్ వెలింగ్ కర్ కు నచ్చచెప్పి మద్దతు తీసుకోవాలని కేంద్ర మంత్రి మనోహర్ పారీకర్, బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.
నలుగురు ఎమ్మెల్యేల మద్దతుతో గోవాలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ సైతం పావులుకదుపుతోంది. అయితే కాంగ్రెస్ ను అడ్డుకుని అక్కడా బీజేపీ అధికారంలోకి రావాలని తీవ్రప్రయత్నాలు చేస్తున్నది. మొత్తం మీద గోవాలో స్వతంత్ర ఎమ్మెల్యేలు, గోవా సురక్షా మంచ్, శివసేన, మహారాష్ట్ర గోమంతకర్ పార్టీ కూటమి ఎవరికి మద్దతు ఇస్తే వారు అధికారంలో ఉండే అవకాశం ఉంది.