జయ మృతిపై సీబీఐ విచారణ: శశికళ పుష్ప పిటిషన్ను కొట్టివేసిన సుప్రీం
జయ మృతిపై అన్నాడీఎంకె బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కొట్టివేసింది.
న్యూఢిల్లీ: తమిళ దివంగత సీఎం జయ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలంటూ సుప్రీం మెట్లెక్కిన అన్నాడీఎంకె బహిష్కృత ఎంపీ శశికళ పుష్పకు చుక్కెదురైంది. ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం గురువారం నాడు కొట్టివేసింది.
కాగా, తన పిటిషన్ లో జయలలిత మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చివరి రోజుల్లో జయలలితకు అందించిన చికిత్స వివరాలు మిస్టరీగా మిగిలిపోయాయని, దీని వెనకాల ఏదో కుట్ర జరిగి ఉంటుందన్న అనుమానం అటు జనంలోను నెలకొందని శశికళ తన పిటిషన్ లో పేర్కొన్నారు.
ఇదివరకే అపెక్స్ కోర్టు శశికళ పిటిషన్ ను కొట్టివేయగా.. గతవారం మద్రాస్ కోర్టులో శశికళ నటరాజన్ పై దాఖలు చేసిన పిటిషన్ సైతం కొట్టివేయబడింది. అన్నాడీఎంకె అధినేత్రిగా శశికళ నటరాజన్ ఎన్నిక చెల్లదని, దీనిపై స్టే విధించాలని శశికళ పుష్ప దాఖలు చేసిన పిటిషన్ ను సైతం కోర్టు కొట్టివేసింది.
ఇదే అంశంపై అన్నాడీఎంకె దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఆమెను పార్టీ నుంచి బహిష్కరించిన కారణంగా.. పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అర్హత ఆమెకు లేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వాదనను సమర్థిస్తూ శశికళ పుష్ప పిటిషన్ ను మద్రాస్ కోర్టు కొట్టివేసింది.