ఏపీ సహా ఆరు రాష్ట్రాలకు సుప్రీం దెబ్బ.. లక్ష రూపాయల జరిమానా
ఢిల్లీ : ఐదు రాష్ట్రాలపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీతో పాటు మరో ఐదు రాష్ట్రాలకు జరిమానా విధించింది. మధ్నాహ్నం భోజన పథకం సరిగా అమలుచేయకపోవడమే దీనికి కారణం. ఏపీ, ఢిల్లీ, మేఘాలయ, ఒడిశా, జమ్ముకాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు లక్ష రూపాయల ఫైన్ వేసింది సుప్రీంకోర్టు. గవర్నమెంట్ స్కూళ్లల్లో మధ్యాహ్న భోజన పథకం అమలును సీరియస్ గా తీసుకోవడం లేదనేది ఇక్కడ మెయిన్ పాయింట్.
మధ్యాహ్న బోజన పథకం అమలు, పరిశుభ్రతకు సంబంధించి పారదర్శకత కోసం గతంలో సుప్రీంకోర్టు కొన్ని సూచనలు చేసింది. ముఖ్యంగా ఆన్లైన్ లో వివరాలు పొందుపరచాలని, దానికోసం సత్వర చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే నెలరోజులు గడుస్తున్నా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు సుప్రీం ఆదేశాలను పాటించలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు జరిమానా విధించింది.
లక్ష రూపాయల జరిమానా మొత్తాన్ని నెలరోజుల్లోగా సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీలో డిపాజిట్ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. బడికి వెళ్లే చిన్నారులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి వివరాలు సరిగా నమోదు చేయడం లేదని, ఆహారధాన్యాలు మాయం చేయడం లాంటి అవకతవకలకు ఆస్కారం ఏర్పడుతోందని చాలా పిటిషన్లు దాఖలైనట్లు పేర్కొంది ధర్మాసనం.