జయ ఆస్తుల కేసు, మూడు మార్గాలున్నాయని సుప్రీం
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆస్తుల కేసు సుప్రీం కోర్టు ముందుకు వచ్చింది. విచారణ సమయంలో జస్టిస్ అమితావ రాయ్ మాట్లాడుతూ... సర్క్యులేషన్లో ఉన్న డబ్బులు అన్నీ జయలలితవేనా కాదా అనే అంశంపై ఆధారం ఉందా అని ఆరా తీశారు.
జయలలితకు సంబంధించిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసును కర్ణాటక హైకోర్టు కొట్టి వేయడాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు పరిష్కారానికి మూడు మార్గాలున్నాయని అభిప్రాయపడ్డ న్యాయమూర్తులు ఏం చేద్దామని అడిగారు.
హైకోర్టు తీర్పును సమర్ధించడం ఒకటైతే, తిరస్కరించి జైలు శిక్షను ఖరారు చేయడం రెండోదని, లేకుంటే కేసును మొదటి నుంచి తిరిగి విచారించాలని హైకోర్టునే మరోసారి ఆదేశించాల్సి ఉంటుందన్నారు. అంతకుముందు కర్ణాటక ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన దుష్యంత్, తీర్పులో హేతుబద్ధత లోపించిందని వివరించారు.
ఆస్తుల సంపాదన నేరం కాదని, అక్రమంగా సంపాదిస్తేనే నేరమని అభిప్రాయపడ్డ కోర్టు... తదుపరి విచారణను వాయిదా వేసింది. కాగా, తమిళనాడు సీఎం జయలలిత ఆస్తుల కేసు సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోన్న విషయం తెలిసిందే.