దావూద్ కేసులో జోక్యం చేసుకోలేం: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను భారత్ కు రప్పించాలని దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టి వేసింది. దావూద్ ఇబ్రహీం వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పి పిటిషన్ కొట్టివేసింది.
మధ్యప్రదశ్ కు చెందిన ఒక మాజీ శాసన సభ్యుడు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం మీద భారతదేశంలో అనేక కేసులు నమోదు అయ్యాయని పిటిషన్ లో వివరించాడు. పలు కేసులలో నిందితుడు అయిన దావూద్ ఇబ్రహీం విదేశాలలో తలదాచుకున్నాడని వివరించాడు.
అన్ని కేసులు ఉన్న దావూద్ ఇబ్రహీంను భారత్ తీసుకు వచ్చే విషయంలో ఇక్కడి అధికారులు ఎందుకు విఫలంఅవుతున్నారనే విషయం అర్థం కావడం లేదని పిటిషన్ లో తెలిపాడు. దావూద్ ఇబ్రహీంను భారత్ కు రప్పించే విషయంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలని మనవి చేశాడు.
సుప్రీం కోర్టు జడ్జి నేతృత్వంలో ప్రత్యేక కమిటి వేసి దావూద్ ఇబ్రహీం కేసు దర్యాప్తును పర్యవేక్షించాలని మనవి చేశాడు. బుధవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్. దత్తు నేతృత్వంలో ప్రత్యేక బెంచ్ అర్జీ విచారించింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పి అర్జీ కొట్టివేసింది.