కాశ్మీర్ ప్రభుత్వం ఏర్పాటుపై పీడీపీ షరతులు
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి ఇంకా సమయం పట్టే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ తమ మిత్ర పక్షం బీజేపీకి పలు షరతులు విధించింది. అయితే బీజేపీ మాత్రం వేచి చూద్దాం అంటున్నది.
మంగళవారం ప్రభుత్వ ఏర్పాటు పై మీ తుది నిర్ణయం చెప్పండి అంటూ పీడీపీ, బీజేపీ నాయకులకు గవర్నర్ సూచించారు. పీపుల్స్ డెమక్రటిక్ పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీ గవర్నర్ ను కలిసి చర్చించారు.
అనంతరం మెహబూబా ముఫ్తీ మీడియాతో మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ లో ఆర్థికాభివృద్ది, శాంతి స్థాపన కాపాడుతామని తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వం హామి ఇవ్వాలని మెహబూబా ముఫ్తీ బీజేపీకి షరతులు విధించారు.
దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే జమ్మూ కాశ్మీర్ భిన్నమైనది. ఇక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయితే ఉత్తమ వాతావరణం ఏర్పడుతుందని, ఆర్థికాభివృద్ది చెందడానికి చక్కటి అవకాశం ఉందని ఆమె అన్నారు. ఈవిషంపై బీజేపీ భరోసా ఇస్తే వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.
జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తగిన నిర్ణయం తీసుకోనున్నారు. అందు కోసం 8 రోజులు అవకాశం ఇవ్వాలని బీజేపీ నాయకులు పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీకి మనవి చేశారు. తరువాత బీజేపీ నాయకులు సైతం గవర్నర్ ను కలిసి చర్చించారు.