అందాల పోటీల్లో సత్తా చాటిన తెలుగు సౌందర్యం..!ఈషా కోడెకు మిస్ టీన్ ఇండియా వరల్డ్ వైడ్ టైటిల్..!!
ముంబాయి/హైదరాబాద్ : తెలుగు అందానికి ఉన్న ప్రత్యేకత, పరిమళాలు మరో సారి గాభాళించాయి. పదహారణాల తెలుగు అందం తన సౌందర్యాన్ని మరోసారి రుజువు చేసుకుంది. సుకుమార సౌందర్య వేదికపైన తెలుగు అందానికి యావత్ ప్రపంచం మరోసారి దాసోహం అంది. తెలుగు అందంలో ఉన్న ప్రశాంతతను, పవిత్రతను యావత్ ప్రపంచం మరోసారి కొనియాడింది. తెలుగు సంస్కృతిని, సాంప్రదాయాలను పుణికి పుచ్చుకున్న ఈషా అనే టీనేజ్ అమ్మాయి మిస్ టీన్ ఇండియా ప్రపంచ స్థాయి క్రౌన్ ను సొంతం చేసుకుంది. దీంతో 19 దేశాల నుంచి 39 టీనేజ్ అమ్మయిలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో చివరి రౌండ్ వచ్చే సరికి ఏడుగురు అందగత్తెలు మిగిలారు. వారి నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న ఈషా చివరికి అనూహ్యంగా టైటిల్ సాధించింది.
తెలుగు అందానికి ప్రపంచం దాసోహం..!మిస్ టీన్ ఇండియా వరల్డ్ వైడ్ టైటిల్ సాధించిన తెలుగు యువతి..!!
అందాల పోటీల్లో తెలుగు అందం మెరిసింది. ప్రవాస భారతీయుల్లో ఎవరు అందాల సుందరి అనే పోటీల్లో తెలుగు ఆణిముత్యానికి కిరీటం దక్కింది. సెప్టెంబర్ 2 నుంచి7వ తేదీవరకు ముంబాయిలో జరిగిన మిస్ టీన్ ఇండియా వరల్డ్ వైడ్ 2019 పోటీల్లో ఈషా కోడె సత్తా చాటి టైటిల్ ను సొంతం చేసుకున్నారు.. భారతదేశం నుంచి వలస వెళ్లి వివిధ దేశాల్లో నివాసముంటున్న ప్రవాస భారతీయుల్లో యుక్త వయస్సు యువతుల మధ్య ఈ పోటీ జరిగింది. అమెరికా,కెనడా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, యూఏఈ, ఓమెన్, ఫిజి, మారిషస్, మలేషియా, సింగపూర్, హంగేరి,గునియా, జర్మనీ, సురనమ్, కెన్యా, గ్వాండ్, కోస్టారికా, ఐర్లాండ్, నేపాల్ తదితర దేశాల నుంచి వచ్చిన యుక్త వయస్సు అమ్మాయిల మధ్య ఈ పోటీ జరిగింది.
19 దేశాలు.. 39మంది అందెగత్తెలు..! ఐనా తెలుగు అందానికే నిరాజనాలు..!!
ఇలా 39 మంది ఈ పోటీల్లో పాల్గొంటే వారిలో 7 గురు మిస్ టీన్ వరల్డ్ వైడ్ కంటెస్టంట్లు ఉన్నారు. వీరిలో ఈషా కోడె కూడా ఒకరు. ఐదు రోజుల పాటు వీరి మధ్య జరిగిన పోటీల్లో ఈషా కోడె విజేతగా నిలిచి మిస్ టీన్ ఇండియా వరల్డ్ వైడ్ 2019 టైటిల్ దక్కించుకున్నారు. ఐదు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో మొదటి మూడు రోజులు ఈవినింగ్ గౌన్ కాంపిటీషన్ జరిగింది..సెప్టెంబర్ 7 నాడు ఫైనల్ పోటీలు జరిగాయి. పోటీకి వచ్చిన వారిలో టాప్ 10, టాప్ 7, టాప్ 4 కేటగిరీలుగా చేసి వారికి ప్రశ్నలు, మరియు జవాబుల రౌండ్ నిర్వహించారు. ఇందులో వారి ప్రతిభను పరీక్షించి ప్రతి కేటగిరి నుంచి ఒక్కరిని ఫైనల్ గా టాప్ త్రీకి సెలక్ట్ చేశారు.
జడ్జ్ ల ప్రశ్నలకు ధీటైన సమాధానాలు..! అన్నింటిలో మెప్పించిన ఈషా..!!
ఆ తర్వాత వీరి మధ్య కూడా పలు పోటీలు పెట్టారు. పద్మావతి సినిమాలోని దీపికా పడుకొనే పాట "నయనో వాలే" కు ఈషా కోడె నృత్యం చేసి అందరిని ఆకట్టుకుంది. నిరాశ,ఆందోళన, ఒత్తిడి లాంటి మానసిక సమస్యలను అధిగమించి విజయపథంలో నడిచేందుకు స్వచ్ఛంద సంస్థ ద్వారా దీపికా పడుకునే చేస్తున్న కృషి తనకు స్ఫూర్తినిచ్చిందని అందుకనే ఆమె పాటను తాను ఎంచుకున్నానని ఈషా తెలిపారు. తాను కూడా భవిష్యత్తులో ఇలాంటి హ్యాపీ2 థ్రైవ్ స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఈషా పేర్కొన్నారు.. మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు.
అమెరికాలో స్థిరపడ్డ ఈషా కుటుంబం..! తెలుగు సంస్కృతిని మాత్రం మర్చిపోలేదు..!!
పిడియాట్రిక్ కార్డియక్ సర్జన్ కావాలనేది తన లక్ష్యమని వివరించారు. ఈషాకు భారతీయతపై తనకున్న మక్కువ, సేవాభావంపై ఉన్న నిబద్ధత కూడా అనుకూలంగా మారడంతో మిస్ టీన్ ఇండియా వరల్డ్ వైడ్ 2019 కిరీటం సొంతమైంది. ఈషా కోడె మన అచ్చతెలుగమ్మాయి. 90 వ దశకంలో ఈషా కుటుంబం తెలుగునేల నుంచి అమెరికాకు వలస వెళ్లింది. ఏ దేశమేగినా ఎందుకాలిడిన మన భారతీయ వారసత్వాన్ని కాపాడుతూ.. ఆమె తల్లిదండ్రులు ఈషాను పెంచారు. మన కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, మానవత్వ విలువలను ఆమెకు ఒంటబట్టేలా చేశారు. ఇదే నేడు ఆమె ఉన్నతికి దోహదపడిందనే చర్చ జరుగుతోంది.