ఇంటెలిజెన్స్ సర్వే నిజం అయ్యింది: ఊహల్లో బీజేపీ, సీఎం భార్యకు లక్ష మెజారిటీ!
బెంగళూరు: కర్ణాటకలో జరిగిన లోక్ సభ, శాసన సభ ఎన్నికలకు ముందు సీఎం కుమారస్వామికి ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదిక దాదాపు నిజం అయ్యింది. ఎన్నికలకు ముందు మూడు లోక్ సభ నియోజక వర్గాలు, రెండు శాసన సభ నియోజక వర్గాల్లో సర్వే నిర్వహించి నివేదిక ఇవ్వాలని సీఎం కుమారస్వామి ఇంటెలిజెన్స్ వర్గాలకు సూచించారు. ఇంటెలిజెన్స్ వర్గాలు సర్వే నిర్వహించి సీఎం కుమారస్వామి నివేదిక ఇచ్చారు. సీఎం కుమారస్వామి భార్యకు లక్ష ఓట్లకు పైగా మెజారిటీ వచ్చింది.
ఎత్తులకు పైఎత్తులు
బళ్లారి లోక్ సభ నియోజక వర్గంలో మొదట బీజేపీ విజయం సాధిస్తుందని సీఎంకు ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది. ఇంటెలిజెన్స్ నివేదిక సీఎం చేతికి వెళ్లిన తరువాత బళ్లారి ఇన్ చార్జ్ మంత్రి డీకే. శివకుమార్ తన ఎన్నికల ప్రచార వ్యూహాన్ని పూర్తిగా మార్చి వేసి బీజేపీ ఎత్తులకు పైఎత్తులు వేశారు.
సీఎం భార్య రికార్డు
మండ్య లోక్ సభ నియోజక వర్గంలో ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పినట్లు జేడీఎస్ అభ్యర్థి ఎల్ఆర్. శివరామేగౌడ విజయం సాధించారు. రామనగర శాసన సభ నియోజక వర్గంలో పోటీ చేసిన సీఎం కుమారస్వామి సతీమణి అనితా కుమారస్వామి ఊహించని విధంగా 1,25, 043 ఓట్లు సాధించి భారీ విజయం సాధించారు.
లక్ష ఓట్లు తేడా
రామనగర శాసన సభ నియోజక వర్గంలో లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన అనితా కుమారస్వామి రికార్డు సృష్టించారు. రామనగర శాసన సభ నియోజక వర్గం మొదటి మహిళా ఎమ్మెల్యే కూడా అనితా కుమారస్వామి కావడం విశేషం.
బీజేపీకి డిపాజిట్లు గల్లంతు
రామనగరలో బీజేపీ డిపాజిట్లు కొల్పోయింది. రామనగరలో బీజేపీకి కేవలం 15, 906 ఓట్లు వచ్చాయి. రామనగరలో 2,909 నోటా ఓట్లు పోల్ అయ్యాయి. ఇక జమఖండి శాసన సభ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆనంద్ న్యామగౌడకు 87, 013 ఓట్లు, బీజేపీ అభ్యర్థి శ్రీకాంత్ కులకర్ణికి 57, 529 ఓట్లు వచ్చాయి.
శివమొగ్గలో పరువు నిలిచింది
బళ్లారిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీఎస్ ఉగ్రప్పకు 5, 88, 863 ఓట్లు, బీజేపీ అభ్యర్థి శాంతాకు 3, 60, 608 ఓట్లు వచ్చాయి. శివమొగ్గలో బీజేపీ అభ్యర్థి బీవై. రాఘవేంద్రకు 5, 43, 306 ఓట్లు, జేడీఎస్ అభ్యర్థి మధు బంగారప్పకు 4, 91, 158 ఓట్లు వచ్చాయి. మొత్తం మీద కాంగ్రెస్-జేడీఎస్ మిత్రపక్షాల ప్లాన్ ఉప ఎన్నికల్లో బాగానే వర్కౌట్ అయ్యింది.