ఉప ఎన్నికలో స్టాలిన్ కు ఊహించని షాక్..! డీఎంకే అంచనాలను తారుమారు చేస్తున్న తమిళ ప్రజలు..!!
చెన్నై/హైదరాబాద్ : రెండు స్థానాలకు జరుగుతున్న తమిళనాడు ఉప ఎన్నిక ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. గత లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువసీట్లు సాధించి ఊపుమీద ఉన్న ప్రతిపక్ష డీఎంకే పార్టీ ఈ ఉప ఎన్నికల్లో మాత్రం చతికిలబడే పరిస్థితులు తలెత్తాయి. పథకాల పట్టపు రాణి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత తమిళనాడులో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారినట్టు కనిపించాయి. అందుకు గతంలో జరిగిన లోక్ సభ ఎన్నికలే ఉదాహరణగా చెప్పుకుంటున్నారు. ఐతే లోక్ సభ ఎన్నికలు జరిగి ఐదు నెలలు పూర్తికాక ముందే ప్రజల ఆలోచనా విధానంలో మార్పులు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.
తమిళనాడులో రెండు స్థానాలకు ఉప ఎన్నికలు..!వెనకబడ్డ ప్రతిపక్ష డీఎంకే పార్టీ..!!
మహారాష్ట్ర, హరియాణా రెండు రాష్ట్రాలతో పాటు, దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఉప ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా వెలువడుతున్నట్లు తెలుస్తోంది. మిగిలిన రాష్ట్రాల్లో మాదిరే, తమిళనాడులో జరిగిన రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులవుతున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రతిపక్ష డీఎంకే పార్టీకి ఉప ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక తీర్పు వెలువడుతున్నట్టు తెలుస్తోంది.
స్టాలిన్ కు చుక్కెదురు..! ప్రతికూల ఫలితాలిచ్చిన ఉప ఎన్నికలు..!!
తమిళనాడులోని నంగునేరి, విక్రవండి అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో విపక్ష డీఎంకే పార్టీ ఘన విజయం సాధిస్తుందని అందరూ భావించారు. ఖచ్చితంగా ఆ రెండు స్థానాలు ప్రతిపక్ష డీఎంకే ఖాతాలో పడతాయన్న అంచనాలకు భిన్నంగా తాజా ఫలితాలు వెలువడుతున్నాయి. తమిళనాడులో అధికారిక అన్నాడీఎంకే బలహీనమవుతూ, విపక్షడీఎంకే బలపడుతుందన్న అంచనాలకు భిన్నంగా ఫలితాలు మారాయి. ఓట్ల లెక్కింపు సరళిని చూస్తే డీఎంకే కంటే అన్నాడీఎంకే అభ్యర్థులే ముందంజలో ఉండటం పట్ల పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
జయ పార్టీ కే జనం జేజేలు..! కోలుకున్న అధికార అన్నా డీఎంకే..!!
ఐతే జయ లలిత మరణం తర్వాత తమిళనాడులో అన్నాడీఎంకే బలహీనమవుతూ, స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే బలపడుతుందన్న అంచనాలు తమిళనాడు ప్రజానికంలో నెలకొన్నాయి. ఇందుకు తగ్గట్లే, ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే భారీ షాక్ తగిలేలా డీఎంకే పెద్ద ఎత్తున ఎంపీ సీట్లను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజా ఉప ఎన్నికల్లోనూ డీఎంకేకు విజయం పక్కా అన్నట్లుగా అంచనాలు వెలువడ్డాయి. ఐతే తమిళనాడు ప్రజలు మాత్రం డీఎంకే అంచనాలను తలకిందులు చేసారు.
లోపాలను సవరించుకుంటాం..! పార్టీ శ్రేణులు అధైర్యపడొద్దన్న స్టాలిన్..!!
ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు చేపట్టిన తర్వాత కొద్ది పేపటికే ఫలితం డీఎంకే పార్టీకి ప్రతికూలంగా ఉంది. రెండు స్థానాల్లోనూ అన్నాడీఎంకే గెలుపు ఖాయమన్నట్లుగా ఉంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో కాస్త నిరాశకు గురైన అధికార పక్షం తాజా విజయంతో రెట్టించిన ఉత్సాహాన్ని ప్రదర్శించటం ఖాయమనే భావన వ్యక్తం అవుతోంది. మరో రెండేళ్లలో అంటే 2021 లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్బంలో జరిగిన ఉప ఎన్నికలో అధికారపక్ష అభ్యర్థులు విజయం సాధించటం డీఎంకే అధినేత స్టాలిన్ కు షాక్ తగిలనంత పనైపోయినట్టు చర్చ జరుగుతోంది.