బిజెపి పతనం ప్రారంభమైంది, ఆ మూడు రాష్ట్రాల్లో విజయం మాదే: సల్మాన్ ఖుర్షీద్
న్యూఢిల్లీ: బిజెపి పతనం ప్రారంభమైందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ అభిప్రాయపడ్డారు. 2014 లో అధికారంలోకి వచ్చే సమయంలో ఉన్న ఆదరణ బిజెపికి లేదన్నారు.
దేశ వ్యాప్తంగా రైతుల ఆందోళనలు పెరిగాయని ఆయన గుర్తు చేశారు. బిజెపి హయంలో దేశ వ్యాప్తంగా పలు కుంభకోణాలు వెలుగు చూసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. 2019లో బిజెపి తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు లేనే లేవన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలు బిజెపికి అత్యంత క్లిష్టమైనవిగా ఆయన అభిప్రాయపడ్డారు.
దేశంలో సామాజిక అశాంతి నెలకొందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లింలు,దళితులపై బీజేపీ సాగిస్తున్న అణిచివేతకు వ్యతిరేకంగా ఆయా వర్గాలు నిరసనలతో ముందుకొస్తున్నాయన్నారు. దళితుల నిరసనలు దేశం దృష్టిని ఆకర్షించాయని ఆయన ప్రస్తావించారు.
బిజెపి ప్రతిష్ట మసకబారుతోందని సల్మాన్ ఖుర్షీద్ అభిప్రాయపడ్డారు. త్వరలో జరిగే కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి కాంగ్రెస్ పార్టీ ధీటైన పోటీ ఇచ్చే అవకాశం ఉందని సల్మాన్ ఖుర్షీద్ ధీమాను వ్యక్తం చేశారు.
ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందని ఆయన చెప్పారు.2019 ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు విపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు.ఈ మేరకు ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.