బెంగళూరులో 80 లక్షల దాటిన వాహనాల సంఖ్య, రిజిస్ట్రేషన్లు రద్దు చెయ్యలేం, కాలుష్యం!
బెంగళూరు: ఐటీ, బీటీ సంస్థలకు ప్రసిద్ది చెందిన బెంగళూరు నగరం నేడు వాహనాల నగరంగా గుర్తింపు పొందింది. బెంగళూరు నగరంలో అధికారికంగా 80 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయని వెలుగు చూసింది. కర్ణాటక మొత్తం 2.10 కోట్ల వాహనాలు ఉన్నాయని రవాణా శాఖ అధికారులు తెలిపారు.
కర్ణాటక రవాణా శాఖ కమిషనర్ వీపి. ఇక్కేరి కథనం ప్రకారం బెంగళూరు నగరంలో 80 లక్షల వాహనాలు సంచరిస్తున్నాయి. 2018 మార్చి నాటికి బెంగళూరు నగరంలో 74. 92 లక్షల వాహనాలు ఉన్నాయి. అయితే 2019 మార్చి నాటికి బెంగళూరు నగరంలో వాహనాల సంఖ్య 80 లక్షలు దాటిందని వివరించారు.
కొత్త వాహనాల రిజిస్ట్రేన్లు నిలిపి వెయ్యడం రవాణా శాఖకు సాధ్యం కాదని వీపి. ఇక్కేరి అంటున్నారు. వాహనాల సంచారంతో కాలుష్యం పెరిగిపోతుందని, దానిని అరికట్టడానికి విద్యుత్ వాహనాల ఉపయోగించడానికి ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని రవాణా శాఖ కమిషనర్ వీపి. ఇక్కేరి తెలిపారు.
2018-19 ఆర్థిక సంవత్సరంలో నియమాలు ఉల్లంఘించి వాహనాలు నడిపిన వారి నుంచి రూ. 160 కోట్లు అపరాద రుసుం వసూలు చేశామని రవాణా శాఖ కమిషనర్ వీపి. ఇక్కేరి వివరించారు. లోక్ సభ ఎన్నికల సందర్బంగా ఓటర్లను ఉచితంగా ప్రైవేటు వాహనాల్లో తరలిస్తున్నారని ఫిర్యాదులు చేశారని, అలాంటి వాహనాలు సీజ్ చేసి తగిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక రవాణా శాఖ కమిషనర్ వీపి. ఇక్కేరి వివరించారు.