సుష్మ తనకు రాఖీ కట్టేదన్న వెంకయ్య..! జ్ఞాపకాలను నెమరు వేసుకున్న ఉప రాష్టపతి..!!
ఢిల్లీ/హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ (67) మంగళవారం గుండె పోటుతో ఆకస్మాత్తుగా మరణించిన విషయం తెలిసిందే. కాగా ఆమె మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేసారు. ఇక దివంగత సీనియర్ నేత సుష్మా స్వరాజ్కు రాజ్యసభ నివాళులు అర్పించింది. సుష్మా మరణం దేశ రాజకీయాల్లో తీరని లోటు అని విచారం వ్యక్తం చేసింది. . ఈ మేరకు రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సభలో మాట్లాడుతూ, ప్రజల గొంతుక వినిపించే శక్తివంతమైన పార్లమెంటేరియన్ సుష్మా స్వరాజ్ అని కొనియాడారు.
ఆమె అకాల మరణం జాతికి తీరని లోటు అని పేర్కొన్నారు. 'ఆమె నన్ను అన్నా అని పిలిచేవారు. రాఖీ పౌర్ణమి రోజు నాకు రాఖీ కట్టేవారు. అందుకోసం నేనే స్వయంగా వారింటికి వెళ్లేవాడిని. అయితే ఇకపై రాఖీ పండుగ నాడు తానే మా ఇంటికి వస్తానని చెప్పారు. మీరు ఇప్పుడు అత్యున్నత పదవిలో ఉన్నారు. కాబట్టి నేనే వచ్చి రాఖీ కడతాను నాతో అన్నారు' అంటూ సుష్మా స్వరాజ్తో తనకు ఉన్న అనుబంధాన్ని వెంకయ్యనాడు సభ్యులతో పంచుకున్నారు.
అంతే కాకుండా సుష్మా స్వరాజ్ కు హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అత్యంత ప్రావీణ్యం ఉందని తెలిపారు. పార్లమెంటు లోపల, బయట తన ప్రవర్తనతో చేపట్టిన ప్రతీ పదవికి సుష్మ విశిష్ట గౌరవాన్ని తీసుకొచ్చారని ప్రశంసించారు. చనిపోవడానికి కొన్ని గంటల ముందు ట్విట్టర్ లో ఆర్టికల్ 370 రద్దుపై సుష్మ స్పందిస్తూ, 'ఈరోజును చూడటం కోసమే నేను ఇన్నేళ్లు ఎదురుచూస్తున్నా' అని చెప్పారు. సుష్మ స్వరాజ్ చనిపోవడం తనకు తీరని నష్టమని వెంకయ్యనాడు భాగోద్వేగానికి గురయ్యారు. మరో ఢిల్లీ మాజీ సీఎం సుష్మా స్వరాజ్ఆకస్మిక మరణం అటు దేశ రాజధానితో పాటు దేశవ్యాప్తంగా ప్రజలను విషాదంలో ముంచెత్తింది.
మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే సుష్మా స్వరాజ్ 1998లో ఢిల్లీ తొలి మహిళా సీఎంగా పాలనా పగ్గాలు చేపట్టారు. పార్టీలకు అతీతంగా అందరికీ ఆప్తురాలయిన సుష్మా హఠాన్మరణం ఆమె సన్నిహితులకు, అభిమానులకు దిగ్భ్రాంతిని కలిగించింది. ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు విజయంతో సంబరాలు చేసుకుంటున్న బీజేపీ నేతలు, శ్రేణులకు ఈ వార్త అశనిపాతమైంది. సుష్మాస్వరాజ్కు భర్త స్వరాజ్ కౌశల్, కూతురు బన్సురి ఉన్నారు. 2016లో సుష్మాస్వరాజ్కు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లోనూ అనారోగ్యం కారణంగా చూపి ఆమె పోటీ చేయని విషయం అందరికి తెలిసిందే.