గబ్బిలాల మృతితో యూపీలోని ఆ గ్రామ ప్రజల భయం ... కరోనా వల్ల అని అనుమానం
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న వేళ ఎక్కడ ఏం జరిగినా సరే ప్రజల్లో భయాందోళన నెలకొంటుంది . ఇక యూపీలో కరోనా సమయంలో గబ్బిలాలు చనిపోవటం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. చైనాలోని వుహన్లో పుట్టిన కరోనా వైరస్ మొదట గబ్బిలాల నుంచే మనుషులకు సంక్రమించిందని ప్రచారం జరిగింది . ఈ నేపధ్యంలో గబ్బిలాలు చనిపోతే వాటి ద్వారా కరోనా వస్తుందని అక్కడ ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు.
corona update : కరోనా కోరల్లో ఇండియా .. గత 24 గంటల్లో 6,566 పాజిటివ్ కేసులు, 194 మరణాలు
ఇక తాజాగా గత కొద్ది రోజులుగా బిషన్ పురా గ్రామంలో కూడా కొన్ని గబ్బిలాలు చనిపోయాయి. ఇక గబ్బిలాలు చనిపోయాయని గుర్తించడంతో బిషన్పురా గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయని అధికారులు గురువారం తెలిపారు. ఇటీవల ఉత్తర ప్రదేశ్లోని మీరట్లో ఓ చెరువు సమీపంలో గబ్బిలాలు కుప్పలుగా చనిపోయి ఉన్నాయి. అవి ఎందుకు చనిపోయాయో కారణం తెలియని వాళ్ళు అవి కరోనాతోనే చనిపోయాయని భయపడ్డారు. ఇక అధికారులు వాటి శాంపిల్స్ సేకరించి అవి ఎందుకు చనిపోయాయో తెలుసుకునేందుకు వాటిని ల్యాబ్స్ కు పంపారు. తాజాగా కుప్పలు కుప్పలుగా మృతి చెందుతున్న గబ్బిలాల విషయంలో అధికారులు దృష్టి సారించారు.
మణియార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో గబ్బిలాలు చెట్ల నుండి పడి చనిపోతున్న సంఘటనలపై గ్రామస్తులు ఫిర్యాదు చేసినట్లు వారు పేర్కొన్నారు. ఆరోగ్య, అటవీ, పశువైద్య వైద్యుల బృందాలు పరీక్షల కోసం నమూనాలను తీసుకోవడానికి గ్రామానికి చేరుకున్నాయి. ఇక గబ్బిలాల నమూనాలను తీసుకుని టెస్ట్ కోసం ల్యాబ్ కు పంపారు అధికారులు . అవి ఎందుకు చనిపోయాయో తెలుసుకునే పనిలో పడ్డారు. ఇక ఇదే సమయంలో ప్రజలు భయపడవద్దని సూచిస్తున్నారు .ఇక యూపీలోని ఆయా గ్రామాల ప్రజలు మాత్రం గ్రామానికి అరిష్టం అని, ఏదో కీడు జరుగుతుందని వారు వాపోతున్నారు . మరోవైపు గబ్బిలాల మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక తాజాగా గబ్బిలాలు చనిపోతే కూడా కరోనా వైరస్ కు ముడి పెట్టి ప్రజలు భయపడుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది.