గాలి జనార్దన్ రెడ్డి మామ ఇల్లు లూటీ, శివరాత్రికి నంద్యాల వెళ్లారు, పండగ చేసుకున్నారు!
బెంగళూరు/బళ్లారి: మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి మామ (భార్య అరుణ తండ్రి) ఇంటిలో చోరీ జరిగింది. బళ్లారిలోని ఇన్నారెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న గాలి జనార్దన్ రెడ్డి మామ పరమేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులు శివరాత్రి పండగ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా నంద్యాలకు వెళ్లిన సమయంలో ఆయన ఇంటిలో చోరీ జరిగింది.
ఎవ్వరూ లేరు
శివరాత్రి పండగ సందర్బంగా గాలి జనార్దన్ రెడ్డి మామ పరమేశ్వర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా నంద్యాలోని సొంత ఇంటికి వెళ్లారు. పరమేశ్వర్ రెడ్డి ఇంటిలో ఎవ్వరూ లేరని గుర్తించిన నిందితులు మంగళవారం అర్దరాత్రి దాటి తరువాత ఇంటిలో చోరబడ్డారు.
ఉదయం పనివాళ్లు
పరమేశ్వర్ రెడ్డి ఇంటిలోని విలువైన వస్తువులు లూటీ చేసి పరారైనారు. బుధవారం ఉదయం విషయం గుర్తించిన పనివాళ్లు నంద్యాలలో ఉన్న పరమేశ్వర్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. బళ్లారిలోని కౌల్ బజార్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ఆయన రావాలి
నంద్యాల నుంచి పరమేశ్వర్ రెడ్డి బళ్లారికి బయలుదేరారని, ఆయన వచ్చిన తరవాతే ఎంత విలువైన వస్తులు చోరీ అయ్యాయి అనే విషయం తెలుస్తోందని, తరువాత ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని కౌల్ బజార్ పోలీసులు చెప్పారు.
రైల్వే మేనేజర్
అదే ప్రాంతంలో రైల్వే శాఖలో మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఇంటి తలుపులు పగలగొట్టిన దుండుగులు లోపల ప్రవేశించడానికి ప్రయత్నించారు. అయితే రైల్వే మేనేజర్ కుటుంబ సభ్యులు కేకలు వెయ్యడంతో దుండగులు అక్కడి నుంచి పరారైనారు.