బీజేపీ అస్త్రం మోదీ, సరిగా మార్కెటింగ్ చేసుకున్నారు : థరూర్
తిరువనంతపురం : సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు ముఖ్య కారణం నరేంద్ర మోదీ అని అంగీకరించారు కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్. తమ బ్రహ్మాస్త్రం మోదీ .. ఆయన సేవలను బీజేపీ విరివిగా వాడుకుందని వివరించారు. మోదీని, అతని పేరును సరిగ్గా మార్కెటింగ్ చేయడంతో .. ఫలితం ఆ పార్టీ వైపు మొగ్గుచూపిందని వ్యాఖ్యానించారు.
మోదీ మేనియా
ఈ ఎన్నికల్లో మోదీ మేనియా పనిచేసిందని అంగీకరించారు థరూర్. మోదీపై ఉన్న ప్రజాధారణను బీజేపీ సరిగ్గా క్యాష్ చేసుకుందని వివరించారు. ఇందుకోసం ఆ పార్టీకి వేల మంది సోషల్ మీడియా ప్రతినిధులు భాగస్వాములై పనిచేశారని .. మోదీకి ఉన్న పేరును ప్రజల్లోకి తీసుకెళ్లి ఓటు బ్యాంకుగా మలిచారని గుర్తుచేశారు. దీంతోపాటు ఎన్డీఏ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను .. ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారని తెలిపారు. నిజానికి మేలు జరిగిన కన్నా ఎక్కువ ప్రచారం చేసుకున్నారని ఆరోపించారు. దీంతో జాతీయ భద్రత అంశం కీలకంగా మారిందని ... బాలాకోట్ దాడుల అంశం బీజేపీ విజయానికి ఒక కారణమని అభిప్రాయపడ్డారు. ఈ అంశం దక్షిణాదిలో ప్రభావం చూపకున్నా .. ఉత్తరాది, హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో ఎఫెక్ట్ చూపిందని పేర్కొన్నారు థరూర్.
సమస్యలే కొంపముంచాయా ?
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని థరూర్ అంగీకరించారు. తమ పార్టీలో చాలా పెద్ద సమస్యలు ఉన్నాయని .. వాటిని అంతర్గతంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆయా అంశాలపై సీరియస్గా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని నొక్కి వక్కానించారు. దీంతోపాటు దేశంలో నెలకొన్న సమస్యలపై దృష్టిపెట్టాలని పేర్కొన్నారు. ఉదహరణకు దేశంలో ఉపాధి కల్పన 45 ఏళ్ల కన్నా ఎక్కువగా ఉందని ఉదహరించారు. అంతేకాదు తమ పార్టీ మేనిఫెస్టోను తాము ఎక్కువ ప్రచారం చేసుకోలేకపోయామని వివరించారు. ఇదీ కూడా తమ పార్టీ ఘోర పరాజయానికి ఒక కారణమై ఉంటుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా న్యాయ్ (కనీస ఆదాయ పథకం) గురించి ఎక్కువగా ప్రచారం చేసుకోకపోవడం లోపంగా మారిందన్నారు.
టెంపరరీ ..
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి తాత్కాలికమని .. తిరిగి రాహుల్ నేతృత్వంలో పార్టీ మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే కేరళ, పంజాబ్లో ఆ విషయం రుజువైందని తెలిపారు. బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయేనని .. రాహుల్ గాంధీ నేతృత్వంలో పార్టీ బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ నేతల్లో రాహుల్ ఉత్సాహం నింపుతారన్నారు. ఎన్నికల్లో జరిగిన తప్పిదాలపై తాము ఆత్మపరిశీలన చేసుకొని ముందుకుసాగుతామని పేర్కొన్నారు.