కేసీఆర్..ఉద్ధవ్ థాకరే.. టార్గెట్ నిర్మలా సీతారామన్: నిధులు తొక్కిపెట్టారంటూ..!
ముంబై: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వాటాల కేటాయింపుల్లో నెలకొన్న జాప్యాన్ని నిరసిస్తూ మొన్నటికి మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కేంద్ర ప్రభుత్వంపై గుర్రుమంటున్నారు. సుమారు 19 వేల కోట్ల రూపాయలకు పైగా బకాయిలను కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు విడుదల చేయాల్సి ఉంది. ఇన్ని వేల కోట్ల రూపాయలను కేంద్రం తొక్కి పెట్టడం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయడంలో నిధుల లోటును ఎదుర్కోవాల్సి వస్తోందంటూ కేసీఆర్ లేఖ సైతం రాశారు.
అదే బాటలో ఉద్ధవ్..
తాజాగా- ఇదే తరహా పరిస్థితిని ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటోంది. అచ్చంగా కేసీఆర్ తరహాలోనే స్పందిస్తోంది అక్కడి ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం. జీఎస్టీ వాటా బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. జీఎస్టీ వాటా సహా, వివిధ రకాల పన్నుల రూపంలో మహారాష్ట్ర ప్రభుత్వానికి 15,558 కోట్ల రూపాయలను విడుదల చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు ఈ నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
పన్నుల రూపంలో 8,611 కోట్లు..
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద పన్నుల రూపంలో 8,611 కోట్ల రూపాయలతో పాటు 6,946.29 మేర పాత బకాయిలను కేంద్ర ప్రభుత్వం తమకు చెల్లించాల్సి ఉందని ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఆయన నిర్మలా సీతారామన్ కు రాసిన లేఖలో పొందుపరిచారు. ఈ ఏడాది ఏప్రిల్ లో ఆరంభమైన 2019-2020 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రకు 5635 కోట్ల రూపాయలను మాత్రమే విడుదల చేసిందని, గుర్తు చేశారు.
పేరుకు పోతున్న బకాయిలు..
నవంబర్ చివరి నాటికి కేంద్రం వద్ద పేరుకు బకాయిల మొత్తం ఒక్క జీఎస్టీ వాటాల కేటాయింపుల్లోనే 8,611.76 కోట్ల రూపాయలు ఉందని ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు. పాత బకాయిల రూపంలో అందాల్సిన 6,946.29 కోట్ల రూపాయల మొత్తాన్ని కూడా కలుపుకొంటే 15,558 కోట్ల రూపాయలకు చేరుతుందని అన్నారు. ఇంత పెద్ద మొత్తంలో నిధులను కేటాయించకపోవడం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయడం కష్టతరమౌతోందని ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు.
ఆందోళన బాటలో కేసీఆర్ సర్కార్..
కేంద్ర ప్రభుత్వం నుంచి జీఎస్టీ బకాయిలను వసూలు చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఆందోళన బాట చేపట్టిన విషయం తెలిసిందే. జీఎస్టీ వాటాల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కొద్దిరోజుల కిందటే టీఆర్ఎస్ లోక్ సభ, రాజ్యసభ సభ్యులు.. పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శనలను చేపట్టారు. ఆ వేడి తగ్గకముందే- మహారాష్ట్ర ప్రభుత్వం కూడా జీఎస్టీ పన్నుల వాటాల కోసం కేంద్రానికి లేఖ రాయడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.