స్వాతంత్ర్య పోరాటంలో సమరయోధులే కాదు వీర నారీమణులు కూడా ఉన్నారు.!వారి ధైర్యానికి జోహార్లు.!
ఢిల్లీ/హైదరాబాద్ : భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో రక్తం మరిగే అంశాలు, రోమాలు నిక్కబొడుచుకునే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. స్వేచ్చా భారతావని కోసం అశువులుబాసిన ఎంతో మంది త్యాగధనుల చరిత్ర ఇప్పటి తరాల యువతకు ఎంతో ఉద్వేగభరితంగా, మరెంతో ఉద్విగ్నంగా పరిణమిస్తుంటుంది. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కారణజన్ములనే భావనతో పాటు చరిత్రకారులనే భావన జనించకమానదు. స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటంలో కేవలం పురుషులే కాకుండా మహిళలు చూపిన తెగింపు కూడా అసాధారణమైనదిగా చెప్పుకోవచ్చు. స్వాతంత్ర్య పోరాటంలో స్త్రీలు కాదు సివంగులనిపించుకున్న మహిళలు ఎవరు.? వారు చూపించిన ధైర్యసాహసాల గురించి తెలుసుకుందాం.!
స్వాతంత్ర్య పోరాటం..
భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది పోరాటం చేశారు. దాస్య శృంఖలాలను తెంచుకునేందుకు పోరాట పటిమను, తెగువను చూపించారు. ఒకానొక సందర్బంలో భారత స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను సైతం అర్పించారు. ఎంతో మంది మహానుభావులు ప్రాణత్యాగం చేసి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొస్తే, వారితో సరి సమానంగా కొంతమంది మహిళలు కూడా తెగించి స్వేచ్చా భారతదేశం కోసా పోరాడారు. సాంప్రదాయాలకు, కట్టుబాట్లకు పెద్దయెత్తున ప్రాముఖ్యత ఇచ్చే రోజుల్లో మహిళలు స్వతంత్ర పోరాటంలో పాల్గొని భారతదేశ పౌరుషాన్ని చాటారు. మహిళలు అయినప్పటికీ తెగించి బ్రిటీషర్లతో పోరాడారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వాములయ్యారు.
చెన్నమ్మ, సరోజినీ నాయుడు..
కర్ణాటకలోకి బెల్గాం ప్రాంతానికి చెందిన కిట్టూరు రాజా మల్ల సర్జా భార్యే చెన్నమ్మ. వీరిది రాజకుటుంబం కావడం విశేషం. 1778 లో జన్మించిన చెన్నమ్మ, 1829 లో అశువులుబాసారు. కిట్టూరు రాజు మరణించిన తర్వాత.. రాజ్యాధికారాన్ని చెన్నమ్మ చేపట్టింది. కానీ 1824లో తమ రాజ్యంపై బ్రిటీష్ వాళ్లు ఆధిపత్యాన్ని చెలాయించడానికి వ్యతిరేకించింది. వాళ్లపై యుద్ధం ప్రకటించింది. అయితే బ్రిటీషర్లు ఆమెను ఓడించి ఖైదు చేశారు. భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో వినిపించే మరో వీర నారీమణి సరోజినీ నాయుడు. స్వాతంత్ర్య సమర యోధురాలు, కవయిత్రి. అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహా సభలకు తొలి మహిళా అధ్యక్షురాలు, స్వతంత్ర భారత తొలి మహిళా గవర్నర్. 1879 ఫిబ్రవరి 13న హైదరాబాద్ లో బెంగాళీ బ్రాహ్మణ కుటుంబంలో ఆమె జన్మించారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో ఆమె పాత్ర మరువలేనిది. క్విట్ ఇండియా ఉద్యమంలోనూ ఆమె చురుకుగా పాల్గొన్నారు. ఈమెకు భారత కోకిల అనే బిరుదు కూడా ఉంది.
రాణీ లక్ష్మీబాయి, సుచేతా కృపలానీ..
ధైర్య సాహసాలకు మారుపేరుగా పిలుచుకునే ఝాన్సీ రాణి లక్ష్మీబాయి అందరికి సుపరిచితురాలే. ఉత్తర భారతదేశంలోని ఝాన్సీ రాజ్యానికి రాణిగా వ్యవహరించారు. 1857లో జరిగిన భారతదేశ తిరుగుబాటులో ఆమె ప్రముఖ పాత్ర పోషించారు. ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామం అది. ఆ తర్వాత అనేక సార్లు బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడి ఝాన్సీ రాణి చరిత్రకెక్కారు. ఇక స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన మరో మహిళ సుచేతా కృపలానీ. స్వాతంత్ర్య సమరయోధురాలు, మహిళా రాజకీయవేత్త, ఉత్తర ప్రదేశ్ కు మొదటి మహిళా ముఖ్యమంత్రి. సుచేతా కృపలానీ హర్యానాలోని అంబాలాలో ఓ బెంగాలీ కుటుంబంలో జన్మించారు. భారత జాతీయ కాంగ్రెస్ కార్యకలాపాల్లో సుచేతా చురుకుగా పాల్గొనేవారు. క్విట్ ఉద్యమంలోనూ సుచేతా కృపలానీ చురుకుగా పాల్గొన్నారు. ఆ తర్వాత మహాత్మా గాంధీతోనూ సన్నిహితంగా పనిచేశారు సుచేతా కృపలానీ.
కాంగ్రెస్ మొదటి మహిళ అధ్యక్షురాలు అనిబిసెంట్..
అనిబిసెంట్ ఐరిష్ మహిళ, థియోసాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియాకు నాయకురాలు. ఆమె భారత జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళ అధ్యక్షురాలిగా పనిచేశారు. 1906లో ఇండియన్ హోమ్ రూల్ లీగ్ ను ఆమె స్థాపించారు. ఆ సమయంలోనే భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అంతే కాకుండా రాష్ట్రాలకు అధికారం కట్టబెట్టే క్రమంలో స్దానిక సంస్ధానాలనుండి ఎదురైన సవాళ్లను కూడా మహిళలు సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. తెలంగాణలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎంతో మంది మహిళలు పోరాటం చేసిన సందర్బాలు కూడా ఉన్నాయి. స్వాతంత్ర్య దినోత్సవ సందర్బంగా స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన వీర నారీమణులందరికి వన్ ఇండియా తెలుగు పాదాభివందనం చేస్తోంది.