శివసేన లేకుండా బీజేపీ పాలన సాగదు: సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకంటే ముందు శివసేన పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన సహకారం లేకుండా బీజేపీ మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని నడపలేదని అన్నారు. మహారాష్ట్రలో బీజేపీతో సమాంతరంగా శివసేన కూడా అధికారంలో ఉంటుందని గుర్తుచేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సింపుల్ మెజార్టీ సాధించినప్పటికీ శివసేన లేకుండా బీజేపీ ప్రభుత్వాన్ని నడపలేదని ఆయన వ్యాఖ్యానించారు. గురువారం రోజున మహారాష్ట్ర మరియు హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో సంజయ్ రౌత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
బీజేపీ అభ్యర్థులు పోటీచేసిన చోట శివసేన పోటీ
బీజేపీ శివసేనల మధ్య సీట్ల పంపకాల ఫార్ములా ప్రకారం మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో శివసేన 124 స్థానాల్లో పోటీచేసింది. బీజేపీ 164 స్థానాల్లో బరిలో తమ అభ్యర్థులను నిలిపింది. ఇదిలా ఉంటే బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న రెండు చోట్ల శివసేన తమ అభ్యర్థులను రంగంలోకి దింపింది. కంకావలి మరియు మన్ నియోజకవర్గాల్లో శివసేన అభ్యర్థులు , బీజేపీ అభ్యర్థులు పోటీ చేశారు. ఇదిలా ఉంటే చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ మహారాష్ట్రలో బీజేపీ-శివసేనలు అధికారం చేపడుతాయని అంచనా వేశాయి.
సీట్ల పంపకాలు అమిత్ షా-ఉద్ధవ్ థాక్రేలు నిర్ణయించారు
మహారాష్ట్రలో అధికారం, మరియు బాధ్యతల విషయం బీజేపీ జాతీయాధ్యక్షుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రేలు నిర్ణయించారని గుర్తుచేశారు. ఒకవేళ బీజేపీ పోటీ చేసిన 164 స్థానాలు కాకుండా 180 స్థానాలు వచ్చినా పొత్తులో భాగంగా శివసేన కూడా అధికారంలో ఉంటుందని చెప్పారు సంజయ్ రౌత్. సీట్ల పంపకాల్లో బీజేపీతో దాదాపు సమానంగానే ఉన్నప్పటికీ... మరింత మంచి బేరం కోసం ప్రయత్నాలు చేస్తోంది. కొన్ని ఎగ్జిట్ పోల్స్ పరిశీలిస్తే బీజేపీ 144 సీట్లతో దగ్గరగా వచ్చి ఆగిపోతుందని చెప్పాయి. ఇదే జరిగితే ఇక శివసేన బేరాలు మాని రానున్న ప్రభుత్వంలో ద్వితీయ స్థాయి పాత్ర పోషిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే చాలా ఎగ్జిట్ పోల్స్ బీజేపీ-శివసేన ద్వయం 220-230 సీట్లు వస్తాయని వెల్లడించింది. ఈ సారి శివసేనకు 100 సీట్లు వస్తాయని అంచన వేశాయి.
2014లో ఫలితాల తర్వాత కలిసిన బీజేపీ-శివసేన
ఇక 2014 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు ఎవరికి వారుగా పోటీ చేశాయి. ఫలితాలు వచ్చిన తర్వాత రెండు పార్టీలు కలిశాయి.బీజేపీ 122 సీట్లతో ప్రభుత్వంలో సింహభాగం పాత్ర పోషించగా మిగతా పార్టీలు తూతూ మంత్రంగా సంబంధాలు కొనసాగించాయి. అయితే ఈ సారి మాత్రం శివసేన చాలా బలంగా ఉండాలని భావిస్తోంది. ఉపముఖ్యమంత్రి పదవిని డిమాండ్ చేసే అవకాశాలున్నాయి. అయితే ఇలాంటివేమీ ఉండవని బీజేపీ చెబుతోంది. అదేసమయంలో రానున్న ప్రభుత్వంలో శివసేన పార్టీకి చెందిన అభ్యర్థులకు మంచి ప్రాధాన్యత కలిగి ఉన్న పోర్ట్ఫోలియోలతో కూడిన మంత్రి పదవులు అడిగే అవకాశం ఉంది.
బీజేపీ-శివసేనలు ఫలితాల తర్వాత కలిసే ఉంటాయి
పొత్తులో భాగంగా తాము పోటీచేశామని అలాంటప్పుడు బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తే ప్రాబ్లం ఏముందని ప్రశ్నించారు కేంద్ర మంత్రి శివసేన ప్రతినిధి అరవింద్ సావంత్. లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీ హాఫ్ మార్క్ను దాటిందని అయినప్పటికీ రెండు పార్టీలు కలిసే ఉన్నాయన్న విషయాన్ని గుర్తుచేశారు. లోక్సభ ఎన్నికల్లో శివసేన 18 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో మోడీ కేబినెట్లో ఒక కేంద్రమంత్రి పదవిని పొందింది. ఇక ఈసారి అసెంబ్లీ ఎన్నికల విషయానికొస్తే బీజేపీ శివసేన 220 సీట్లలో విజయం సాధిస్తాయని కేంద్రంలో తమ భాగస్వామ్యం ఎలాగైతే ఉందో రాష్ట్రంలో కూడా కొనసాగుతుందని బీజేపీ ప్రతినిధి మాధవ్ భండారీ తెలిపారు.