ఏప్రిల్ 14 తర్వాత ఏం జరుగుతుంది: స్పష్టం చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పలు వదంతులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రం విధించిన 21 రోజుల లాక్డౌన్ ఏప్రిల్ 14 తర్వాత కూడా కొనసాగుతుందనే వదంతులు ఎక్కువయ్యాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురై తమకు కావాల్సిన నిత్యావసర వస్తువుల కోసం ముందుగానే కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో రోడ్లపైకి గుంపులు గుంపులుగా వచ్చేస్తున్నారు. అయితే ఈ వందతులపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో లాక్డౌన్ సమయంపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కేంద్రం స్పష్టం చేసింది.
Recommended Video
లాక్డౌన్ పై కేంద్రం క్లారిటీ
లాక్డౌన్ సమయం మరింత పొడిగిస్తారనే వార్తలు హల్చల్ చేయడంతో ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన వలసదారులు తమ సొంత గ్రామాలకు కాలినడకన బయలు దేరుతూ లేనిపోని కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ముందుకొచ్చి లాక్ డౌన్ పీరియడ్ 21 రోజులు మాత్రమే ఉంటుందని ... సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు ట్వీట్ కూడా చేసింది. ఇదే విషయాన్ని కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గోబా కూడా స్పష్టం చేశారు. లాక్డౌన్ను పొడిగించే యోచన లేదని వెల్లడించారు.
లాక్డౌన్ సమయంలో సూచనలు
మార్చి 22న జనతా కర్ఫ్యూ జరిగిన తర్వాత మార్చి 24న ప్రధాని మరోసారి దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మార్చి 25 నుంచి 3 వారాల పాటు దేశం సంపూర్ణంగా లాక్డౌన్ పరిస్థితుల్లోకి వెళితేనే కరోనావైరస్పై విజయం సాధించగలమని చెబుతూ ఆమేరకు ప్రజలంతా పాటించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఏప్రిల్ 14వరకు దేశమంతా లాక్డౌన్లో ఉంటుంది. ఈ సమయంలో ప్రజారవాణా నిలిచిపోవడం, ఇళ్లల్లోనుంచి బయటకు రాకుండా ఉండటాన్ని పాటించాలని ప్రభుత్వం సూచనలు చేసింది. అంతేకాదు నిత్యావసర వస్తువుల కోసం దుకాణాలు పరిమితి సమయంలో మాత్రమే పనిచేస్తాయని వెల్లడించింది.
వేల సంఖ్యలో వలసకార్మికులు
ప్రధాని చేసిన ప్రకటనతో జీవనం స్తంభించింది. ఢిల్లీ, ముంబై లాంటి మహానగరాలకు పొట్ట చేత పట్టుకుని కూలీ పనుల కోసం వెళ్లిన వారంతా తమ సొంతూళ్లకు బయలుదేరారు. బస్సులు వాహనాలు తిరగకపోవడంతో వీరంతా కొన్ని వేల కిలోమీటర్లు కాలినడకపైనే సొంతూళ్లకు బయలుదేరారు. ఇక ఢిల్లీ ఘజియాబాద్ సరిహద్దుల్లో కొన్ని వేలమంది వలస కార్మికులు చిక్కుకుపోయారు. లాక్డౌన్ వేళ వీరిని హ్యాండిల్ చేయడం చాలా కష్టతరంగా మారింది. అంతా సామాజిక దూరంను పాటించకుండా ఒకే చోట గుమికూడి ఉండటంతో ప్రమాదం పొంచి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు భారత్లో 1100 కరోనావైరస్ కేసులు నమోదు కాగా... 25 మంది మరణించారు.