చిన్నమ్మకు ఝలక్: శశికళ 'ఫోటో' పెట్టడానికే బెంబేలెత్తుతున్నారు..
చిన్నమ్మ ఫోటో ఏర్పాటు చేస్తే.. ఎక్కడ ప్రజలు ఎదురుతిరుగుతారోనన్న భయంతోనే శశికళ ఫోటోను బ్యానర్లలో ఏర్పాటు చేయనట్లు తెలుస్తోంది.
చెన్నై: పార్టీని, ప్రభుత్వాన్ని తన గుప్పిట్లో పెట్టుకోగలిగినా.. ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకతను మాత్రం శశికళ తుడిచిపెట్టలేకపోయారు. ప్రజల్లో శశికళ పట్ల వ్యతిరేకత ఎంత బలంగా పాతుకుపోయిందంటే.. ఆఖరికి ఆమె మద్దతుదారులు సైతం ఆమె ఫోటో వాడటానికి బెంబేలెత్తిపోతున్నారు.
తాజాగా కోవిలంబాక్కంలో జరిగిన ప్రభుత్వ సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమంలో.. పెద్ద ఎత్తున పార్టీ బ్యానర్లు ఏర్పాటు చేసినా.. అందులో ఎక్కడా చిన్నమ్మ ఫోటో లేకుండా అన్నాడీఎంకె నేతలు జాగ్రత్తపడ్డారు. చిన్నమ్మ ఫోటో ఏర్పాటు చేస్తే.. ఎక్కడ ప్రజలు ఎదురుతిరుగుతారోనన్న భయంతోనే శశికళ ఫోటోను బ్యానర్లలో ఏర్పాటు చేయనట్లు తెలుస్తోంది.
కాగా, ప్రభుత్వ కార్యక్రమం కోసం పల్లావరం-తురైపాక్కం రోడ్డులో శశికళ వర్గీయులు పెద్ద ఎత్తున భారీ బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఇందులో శశికళ ఎక్కడా ఫోటో కానరాలేదు. అక్రమార్జన కేసులో శశికళ జైల్లో ఉన్నందునా.. ఆమె ఫోటోను ఏర్పాటు చేయడం పార్టీకి చేటు చేస్తుందని ఆ పార్టీ నేతలు భావించినట్లు సమాచారం. ప్రస్తుతానికి శశికళ ఫోటో లేకుండానే జనంలోకి వెళ్లడం మంచిదనే ఆలోచనలో పార్టీ శ్రేణులు ఉన్నాయి.
ఇదిలా ఉంటే, అక్రమార్జన కేసులో దోషిగా తేలడంతో బెంగుళూరులోని పరప్పన జైల్లో అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.