ఉత్తర కర్ణాటక కాంగ్రెస్ లో మగాళ్లు లేరు, అందుకే ఆయన వచ్చారు, బీజేపీ ఎమ్మెల్యే ఫైర్!
బెంగళూరు: ఉత్తర కర్ణాటకలో బీజేపీ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వం మీద తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాల మీద నిత్యం విరుచుకుపడే బసవనగౌడ పాటిల్ ఈ సారి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రధాని మీద విరుచుకుపడ్డారు.
కుందగోళ్ శాసన సభ ఉప ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మంత్రి డీకే. శివకుమార్ ను ఎందుకు పిలిపించారు అని కోందరు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన బీజేపీ నేత బసవనగౌడ పాటిల్ యత్నాల్ ఉత్తర కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరూ మొగాళ్లు లేరని, అందుకే డీకే. శివకుమార్ ను పిలిపించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారం చేస్తున్న బసవనగౌడ పాటిల్ యత్నాల్ కాంగ్రెస్ తో పాటు జేడీఎస్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడకు 28 మంది మనవళ్లు లేరని అన్నారు. ఒకవేళ 28 మంది మనవళ్లు ఉంటే 28 లోక్ సభ నియోజక వర్గాల నుంచి పోటీ చేయించి ఉంటారని ఎద్దేవ చేశారు.
మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడకు 90 ఏళ్లు వచ్చినా ఇంకా అధికార దాహం తగ్గలేదని బసవనగౌడ పాటిల్ యత్నాల్ విమర్శించారు. కర్ణాటక రాజకీయాల భవిష్యత్తును కుందగోళ్, చించోళి ఉప ఎన్నికలు నిర్ణయిస్తాయని, అందులో ఎలాంటి సందేహం లేదని బసనగౌడ పాటిల్ యత్నాల్ అన్నారు.
ఉప ఎన్నికల జరుగుతున్న నియోజక వర్గాల ప్రజలకు బసవనగౌడ పాటిల్ యత్నాల్ ఓ మనవి చేశారు. ఈ రెండు నియోజక వర్గాల ప్రజలు బీజేపీకి ఓటు వేస్తే రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాలతో పోటీ పడి ఈ నియోజక వర్గాలను అభివృద్ది చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
మండ్య ప్రజలు నిఖిల్ కుమారస్వామి నీవు ఎక్కడున్నావప్పా అంటున్నారని బసవనగౌడ పాటిల్ యత్నాల్ ఆయన్ను తనదైన శైలిలో విమర్శించారు. హోం మంత్రి ఎంబి. పాటిల్ ను బీజేపీలోకి తీసుకురావడం తనకు పెద్ద పని కాదని అన్నారు. ఎంబీ పాటిల్ బీజేపీలో చేరడానికి సిద్దం అయితే తాను ముందు నిలబడి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానిస్తానని, బీజేపీలో ఆయనకు సముచిత స్థానం ఇప్పించడానికి చర్యలు తీసుకుంటానని రెండు రోజుల క్రితం బసవనగౌడ పాటిల్ యత్నాల్ చెప్పిన విషయం తెలిసిందే.