కేజ్రీవాల్ ముమ్మాటికీ ఉగ్రవాదే.. అందుకు రుజువులున్నాయి: కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ ఉగ్రవాది అని సంబోధించిన ఎంపీ పర్వేష్ వర్మ ఆ తర్వాత ఎన్నికల సంఘం నుంచి నోటీసులు కూడా అందుకున్నారు. ఈ వివాదం పూర్తిగా సమిసిపోకముందే కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ మరోసారి ఢిల్లీ సీఎంను ఉగ్రవాదితో పోల్చుతూ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గరపడుతుండటంతో నేతలు మాటల యుద్ధం పెరిగిపోతోంది.
ఢిల్లీ ఓటర్లు అరవింద్ కేజ్రీవాల్ను తిరస్కరిస్తున్నారని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. కేజ్రీవాల్ అమాయకంగా ముఖంపెట్టి నేను ఉగ్రవాదినా అని ప్రజలను అడుగుతున్నారని చెప్పిన ప్రకాష్ జవదేకర్.. ముమ్మాటికి అరవింద్ కేజ్రీవాల్ ఉగ్రవాదే అని చెప్పారు. ఇందుకు సంబంధించిన రుజువులు కూడా ఉన్నాయని జవదేకర్ చెప్పారు. కేజ్రీవాల్ తనకు తానుగా అరాచకవాదని చెప్పుకున్నారని గుర్తుచేసిన జవదేకర్... అరాచకవాదికి ఉగ్రవాదికి పెద్ద తేడా ఏమీ లేదని అన్నారు.
#WATCH Union Minister Prakash Javadekar in Delhi: Kejriwal is making an innocent face & asking if he is a terrorist, you are a terrorist, there is plenty of proof for it. You yourself had said you are an anarchist, there is not much difference between an anarchist & a terrorist. pic.twitter.com/vRjkvFKGEO
— ANI (@ANI) February 3, 2020
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై ముందుగా ఉగ్రవాది అనే పదాన్ని ప్రయోగించింది ఎంపీ పర్వేష్ వర్మ. జనవరి 25వ తేదీన ఓ ప్రచారంలో పాల్గొన్న వర్మ ఈ విధమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ లాంటి వ్యక్తి తిరిగి సీఎం అయితే నిత్యం షాహీన్బాగ్ లాంటి నిరసనలు చూడాల్సి వస్తుందని పర్వేష్ వర్మ అన్నారు. అంతేకాదు షాహీన్బాగ్ నిరసనకారులు ఇళ్లల్లోకి ప్రవేశించి మహిళలపై, ఆడపిల్లలపై అత్యాచారం చేసి చంపేస్తారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ముస్లిం సామాజికవర్గం వారు హిందువులకు చెందిన మహిళలను ఎత్తుకెళుతున్నారన్న వార్తలు వింటున్నామన్న పర్వేష్ వర్మ... ఉగ్రవాది లాంటి కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయన్నారు. అంతేకాదు కశ్మీర్లో ఉన్న ఉగ్రవాదులతో పోరాడాలా లేక ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ లాంటి ఉగ్రవాదులతో పోరాడాలా అర్థం కావడం లేదన్నారు పర్వేష్ వర్మ. పర్వేష్ వ్యాఖ్యలపై ఈసీ స్పందించి అతనికి నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఆయనపై నాలుగు రోజుల పాటు ప్రచారం చేయకుండా నిషేధం విధించింది.
ఢిల్లీ ప్రజలకోసం మెడిసిన్స్ ఇచ్చానని, తన కుటుంబంను సైతం పక్కన పెట్టి నిత్యం ఢిల్లీ ప్రజల అభివృద్ధి కోసమే పనిచేసి మంచి పాలన అందించానని కేజ్రీవాల్ చెప్పారు. అలాంటప్పుడు తాను ఢిల్లీ పుత్రుడిని కాకుండా ఉగ్రవాదిని ఎలా అవుతానో ప్రజలే చెప్పాలంటూ భావోద్వేగానికి గురయ్యారు కేజ్రీవాల్. పర్వేష్ వర్మ వ్యాఖ్యలపై ఆమ్ఆద్మీ పార్టీ ఈసీని కలిసి అతనిపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశాలు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేసింది.