మోడీజీ! కాపాడండి: చైనా వుహాన్లో భారత దంపతుల మొర, అపార్ట్మెంట్లో ఒకే జంట
బీజింగ్: చైనాలోని వుహాన్ నగరం కరోనావైరస్(కొవిడ్-19)కు కేంద్రంగా ఉన్న విషయం తెలిసిందే. కాగా, వుహాన్ నగరంలోనే ఇద్దరు భారతీయ దంపతులు తమను ఇక్కడ్నుంచి స్వదేశానికి తీసుకెళ్లాలంటూ భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేశారు.
చైనాలో ఆ దంపతులు..
ఈ వీడియోలో చైనాలో ఆ దంపతులు ఎదుర్కొంటున్న పరిస్థితులను వివరించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆశీష్ యాదవ్ చైనాలోని టెక్స్టైల్ వర్సిటీలో అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య నేహ పీహెచ్డీ స్కాలర్. కరోనావైరస్ ప్రబలిన కారణంగా ఇటీవల చైనాలోని భారతీయుల్ని స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం విమానం పంపింది.
మోడీజీ కాపాడండి..
అయితే, ఆ సమయంలో నేహకు శస్త్రచికిత్స జరగడంతో వారు ఆ విమానంలో రాలేకపోయారు. ప్రస్తుతం చైనాలో పరిస్థితులు బాలేవని, తమను వెంటనే స్వదేశానికి తీసుకెళ్లాలంటూ వేడుకుంటున్నారు. తాము ఉంటున్న అపార్ట్మెంట్ మొత్తం ఖాలీ అయ్యిందని, తమను భారత్కు తీసుకెళ్లాలంటూ ప్రధాని నరేంద్ర మోడీని కోరారు.
స్పందించిన విదేశాంగ శాఖ..
కాగా, భారత విదేశాంగ శాఖ ట్విట్టర్ వేదికగా ఇలాంటి వారి కోసం తాజాగా ఓ కీలక సూచన చేసింది. చైనాలో ఉంటున్న భారతీయులు స్వదేశానికి రావాలనుకుంటున్నవారు అక్కడి మన రాయబార కార్యాలయానికి సమాచారం అందజేయాలని తెలిపింది. వాందరినీ భారత్ రప్పిస్తామని, వారు భారత ఎంబసీ అధికారులతో సంప్రదింపులు జరుపుతూ ఉండాలని సూచించింది. కాగా, ఇప్పటికే వుహాన్ నగరం నుంచి 600 మంది భారతీయులను భారత ప్రభుత్వం ప్రత్యేక విమానంలో స్వదేశానికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
1700 మంది మృత్యువాత
కరోనావైరస్ కారణంగా ఇప్పటికే చైనాలో 1700 మందికిపైగా మృత్యువాత పడ్డారు. సుమారు లక్ష మంది వరకు కరోనావైరస్ బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. వ్యాధి మిగితా నగరాలకు పాకకుండా చైనా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. కాగా, కరోనావైరస్ ఇప్పటికే 26 దేశాల్లో తన ప్రభావం చూపుస్తోంది. ఆయా దేశాల్లో పలువురు కరోనావైరస్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. మనదేశంలోనూ మూడు కేసులు బయటపడ్డాయి.