ఔను.. సెంగార్ అండ్ కో బాధితురాలిపై లైంగికదాడి చేశారు, కోర్టులో సీబీఐ
న్యూఢిల్లీ : ఉద్యోగం ఇస్తానని ఉన్నావ్ బాధితురాలిని బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్, అతని అనుచరుడు శశి సింగ్, ఇతరులు లైంగికదాడికి పాల్పడినట్టు సీబీఐ ధ్రువీకరించింది. ఈ మేరకు ఢిల్లీ కోర్టులో కేసు దర్యాప్తునకు సంబంధించిన ప్రాథమిక వివరాలను అందజేసింది. 2017లో సెంగార్ అండ్ కో కబంధ హస్తాల నుంచి అదృష్టవశాత్తు బాధిత యువతి బయటపడినట్టు పేర్కొన్నది.
లైంగికదాడి నిజమే ..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ బాధితురాలి లైంగికదాడి ఘటనపై సీబీఐ దర్యాప్తు వేగం పెరిగింది. 2017లో జరిగిన లైంగిక దాడి కేసులో బాధితురాలి తండ్రి పోలీసుల దెబ్బలకు చనిపోవడంతో చర్చానీయాంశమైంది. ఇటీవల రాయ్ బరేలి వెళ్తున్న బాధితురాలి కారును ట్రక్కు ఢీ కొనడంతో కుట్రకోణం ఉందని బాధితురాలి కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఆ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా .. బాధితురాలు, ఆమె తరఫు లాయర్ చావు, బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ క్రమంలో లైంగికదాడి ఆరోపణలను సీబీఐ విచారించాలని విపక్షాలు పట్టుబట్టగా .. ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఏం జరిగిందంటే ..
కేసు విచారణకు సంబంధించిన వివరాలను సీల్డ్ కవర్లో అందజేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన వివరాలు ఢిల్లీ కోర్టుకు అందజేసిన అధికారులు .. ఏం జరిగిందో వివరించారు. 2017లో ఉన్నావ్ బాధితురాలు అదృష్టవశాత్తు బయటపడిందని పేర్కొన్నారు. సెంగార్, అతని అనుచరుడు శశి సింగ్ బాధితురాలిపై లైంగికదాడి చేసినట్టు వివరించారు. ఆ సమయంలో యువతి మైనర్ అని .. ఉద్యోగం పేరుతో మభ్యపెట్టి లైంగికదాడి చేశారని తెలిపింది. ఉపాధి కోసం యువతి ఆశపడి వచ్చిందని ... ఆ సమయంలో సెంగార్ ఇంటి వద్ద సెక్యురిటీ సిబ్బంది కూడా లేరని వెల్లడించింది. యువతిని ఇంటి వెనకాల నుంచి తీసుకొని .. తర్వాత ఇంట్లో లైంగికదాడి చేశాడని చెప్పింది. తర్వాత ఉద్యోగం ఇవ్వకపోగా వేధింపులకు గురిచేశారు. ఇదేంటని నిలదీయడంతో బాధితురాలి తండ్రిపై కక్షపూరితంగా కేసు పెట్టారు. ఎమ్మెల్యే అండతో స్థానిక పోలీసుల అతడిని దాడి చేయడంతో చనిపోయాడు. అప్పటినుంచి ఎమ్మెల్యేపై బాధితురాలి పోరాడుతూనే ఉన్నారు.
కోర్టు ఆదేశాల మేరకు ..
ఉన్నావ్ బాధితురాలికి సంబంధించిన పేరు తెలియజేయొద్దని మీడియాకు జిల్లా న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. ఆమె కుటుంబసభ్యులకు సంబంధించిన వివరాలు కూడా తెలుపొద్దని .. అలా చేస్తే వారిపై దాడులు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే బాధితురాలి పేరుపై మీడియా గోప్యత పాటించింది. ఈ కేసు వివరాలను సుప్రీంకోర్టు మార్గదిర్గేశాల మేరకు ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు న్యాయస్థానానికి తెలియజేస్తున్నారు.