సోమవారం మాయావతి.. మంగళవారం అఖిలేష్: మహాకూటమి వస్తే రోజకో ప్రధానిని చూస్తామన్న అమిత్ షా
మహాగట్భంధన్ అధికారంలోకి వస్తే ప్రతిరోజు ఒక కొత్త ప్రధానిని చూడాల్సి ఉంటుందని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అన్నారు. కాన్పూర్లో బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశమైన అమిత్ షా అక్కడ ప్రసంగించారు. ఇప్పటి వరకు కూడా విపక్షపార్టీలు తమ ప్రధాని అభ్యర్థి ఎవరో తేల్చుకోలేకున్నాయని ధ్వజమెత్తారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అమిత్ షా కాంగ్రెస్ పార్టీ మహాకూటమిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.
ప్రతిరోజు కూటమి నుంచి ఒక కొత్త ప్రధానిని చూస్తాం
మహాకూటమి అధికారంలోకి వస్తే మాయావతి ప్రధానిగా సోమవారం ఉంటే.. మంగళవారం రోజున అఖిలేష్ యాదవ్ ఉంటారు, బుధవారం రోజున మమతా బెనర్జీ ప్రధానిగా ఉంటే.. శరద్ పవార్ గురువారం రోజున ప్రధానిగా ఉంటారని ఎద్దేవా చేశారు. ఇక శుక్రవారం రోజు దేవెగౌడ ప్రధానమంత్రిగా ఉంటే శనివారం రోజు స్టాలిన్ ప్రధానిగా వ్యవహరిస్తారని.. ఆదివారం రోజున సెలవుదినంగా ప్రకటిస్తారని సెటైర్లు వేశారు అమిత్ షా. మార్పు కోసం మాట్లాడుతున్న మహాకూటమి నాయకులు మార్పు తెచ్చేందుకు ఒక సరైన నాయకుడు లేరని అమిత్ షా విమర్శించారు.
మోడీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వం
బీజేపీకి నాలుగు 'బీ'లు ఉన్నాయన్నారు అమిత్ షా. 'భడ్తా భారత్', ' బన్తా భారత్'. మహాకూటమిగా ఏర్పడుతున్న వారికి కూడా నాలుగు 'బీ'లు ఉన్నాయని వెల్లడించారు. 'బావువా' (అత్త), 'భతీజా'(అల్లుడు)'భాయ్'(సోదరుడు) మరియు 'బెహెన్' (సోదరి) అని చెబుతూ వారసత్వ రాజకీయాలపై మండిపడ్డారు అమిత్ షా. మహాకూటమి దేశాన్ని ముందుకు తీసుకెళ్లలేదని విమర్శించిన అమిత్ షా... మోడీ నేతృత్వంలో ప్రభుత్వం బలంగా ఎదగాలని కోరుకుంటున్నామన్నారు. మహాకూటమి నాయకులకు బలహీనమైనప్రభుత్వం కావాలని ఆకాంక్షిస్తున్నారని అన్నారు. ప్రధాని మోడీ బలమైన ప్రభుత్వంను అందిస్తారని చెప్పారు.
బీజేపీ ప్రభుత్వం రామమందిరం నిర్మించి తీరుతుంది
కాంగ్రెస్ నేతలపై కూడా నిప్పులు చెరిగారు అమిత్ షా. రామజన్మభూమిపై మాట్లాడే హక్కు ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడికి లేదన్నారు. రామ జన్మభూమిలోనే రామమందిరం నిర్మాణం జరుగుతుందని అది కూడా బీజేపీ ప్రభుత్వంలోనే జరుగుతుందని అమిత్ షా హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రామజన్మభూమి న్యాస్కు చెందిన 42 ఎకరాలు సేకరించిందని, దాన్ని తిరిగి ఇవ్వాల్సిందిగా న్యాస్ అడుగుతోందని గుర్తు చేశారు అమిత్ షా. ఈ సమస్యకు పరిష్కారం త్వరలోనే దొరుకుతుందని ఆ తర్వాత రామమందిర నిర్మాణం ఘనంగా జరుగుతుందని వెల్లడించారు అమిత్ షా.