భిచ్చగాళ్లు ఇంత వెనుకేస్తున్నారా? : బ్యాంకులు-ఏటీఎంలూ, సేవింగ్స్..
అజ్మీర్ : కాస్త రద్దీగా ఉండే ఏ సెంటర్ దగ్గరైనా.. ఆటోనో, బస్సో దిగి దిగగానే మీ ముందు వాలిపోతారు. బొచ్చెలో దేవుడి బొమ్మ ఒకటి పెట్టుకుని డిమాండ్ చేసినంత పనిచేసి మరీ మీ చేత భిచ్చం వసూలు చేయించుకుంటారు. కుంటివాళ్ల లాగో, గుడ్డివాళ్ల లాగో నటించి భిచ్చం అడుక్కునేవాళ్ల కంటే ఇప్పుడిలా దేవుడిని బొచ్చెలో పెట్టుకుని అడుక్కునేవారే ఎక్కువగా కనిపిస్తున్నారు.
ఇక గుళ్లు, దర్గాలు లాంటి చోట పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఉద్యోగాలు చేసుకునేవాళ్ల ఆర్థిక పరిస్థితి అయినా ఒక్కోసారి తలకిందులు అవచ్చు గానీ ప్రస్తుత బెగ్గర్స్ పరిస్థితి మాత్రం అత్యంత స్థిరాదాయంతో సాగుతుందన్న లెక్కలు బయటపడుతున్నాయి. తాజాగా అజ్మీర్ దర్గా వద్ద భిక్షాటన చేస్తోన్న పలువురి ఆర్థిక లావాదేవిల వివరాలు వింటే ఖచ్చితంగా నోరెళ్లబెట్టడం ఖాయం.
అక్కడ భిక్షాటన చేసే చాలామందికి బ్యాంకు ఖాతాలు, ఏటీఎంలు కామన్. బీహార్ కు చెందిన పప్పు సింగ్ అనే బెగ్గర్ అజ్మీర్ దగ్గర వద్ద బిచ్చం అడుక్కుంటూ ఉంటాడు. రోజువారి ఖర్చులు పోను ప్రతీ రోజు రూ.200 ఇప్పుడతని సేవింగ్స్ లో జమచేస్తున్నాడు. నిజానికి పప్పూ సింగ్ బెగ్గర్ గా మారిన పరిస్థితులు కూడా చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి.
ఓ యాక్సిడెంట్ ద్వారా తన రెండు కాళ్లు ప్రమాదానికి గురైన సమయంలో ఆశ్వీరాదం తీసుకోవడం కోసం అజ్మీర్ దర్గాను ఆశ్రయించాడు పప్పూ సింగ్. దర్గా ఆశ్వీరాదం ద్వారా త్వరగా కోలుకుంటాననేది అతని భావన. అయితే అక్కడ కొంతమంది భక్తులు అతడిని చూసి భిచ్చగాడిగా పొరబడ్డారు. అలా చాలామంది అతడికి భిచ్చం వేయడం మొదలుపెట్టారు. దీంతో పప్పూ సింగ్ ఆగ్రహానికి గురయ్యేవాడు. అయితే ఆ తర్వాత అదంతా ఓ ఆశీర్వాదంగానే భావించి ఇక భిక్షాటనలోనే కొనసాగుతున్నాడు. దీంతో ప్రస్తుతం అతడు రూ.200 వరకు సేవింగ్స్ చేస్తున్నట్లు వెల్లడించాడు.
త్రిపుర నుంచి వచ్చి అజ్మీర్ దర్గా వద్ద భిక్షాటన చేస్తోన్న మరో ఇద్దరు బెగ్గర్ బ్రదర్స్ కూడా కెనరా బ్యాంక్ లో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేశారు. రజా ఇస్లాం, నహీదుల్ అనే ఈ ఇద్దరు ముస్లింలు గత పదిహేనేళ్లుగా భిచ్చమెత్తుకుంటూ డబ్బు కూడగట్టుకుంటున్నారు. ఇద్దరిలో నహీదుల్ అంధుడు కావడంతో రజా అతనికి సహాయం చేస్తుంటాడు. ఇక నసీమా ఖాన్ అనే కిషన్ గఢ్ కు చెందిన మహిళ అజ్మీర్ దర్గాకు వచ్చి భిచ్చమెత్తుకుంటోంది. దర్గా వద్ద భిచ్చమెత్తుకోగా వచ్చిన డబ్బును రెండు మూడు రోజులకోసారి తమ ఊరెళ్లి బ్యాంకులో పొదుపు చేస్తుంది. నసీమా కూడా ఏటీఎం కార్డు వినియోగిస్తోంది.
సాధారణ రోజుల్లో రోజుకు రూ.200 నుంచి రూ.300 వరకు సేవింగ్స్ చేసే ఈ బెగ్గర్స్.. పండుగ సీజన్లు, ఏవైనా ప్రత్యేక సందర్బాల్లో అయితే రోజుకు రూ.1200 నుంచి రూ.1300 వరకు సేవింగ్స్ చేస్తుండడం గమనార్హం. పొద్దంతా భిచ్చమెత్తుకుంటూ సంపాదించిన మొత్తాన్ని సాయంత్రమవగానే స్థానిక రెస్టారెంట్ల వద్దకు వెళ్లి తమ చిల్లరను వంద రూపాయల నోట్లలోకి మార్చుకుంటారని అజ్మీర్ దర్గాకు సమీపంలో ఉన్న గరీబ్ నవాజ్ రెస్టారెంట్ నిర్వాహకుడు తెలిపాడు.