మూడు పువ్వులు ఆరు కాయలు: ఎన్నికల వేళ ఈ సంస్థలకు భలే డిమాండ్
న్యూఢిల్లీ: ఎన్నికల వేళ దేశంలో విపరీతంగా డబ్బు ఖర్చు చేస్తున్నారు నాయకులు నేతలు. అధికారికంగా ఒకలా చూపుతుంటే అనధికారికంగా డబ్బులు ఏరులై పారుతోంది. ఇదే సమయంలో ఎన్నికల పుణ్యమా అంటూ పలు కంపెనీలు తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను ఆర్జిస్తున్నాయి. మరి భారత్లో ఎన్నికలంటే ఆషామాషీ కాదు కదా... ఎన్నికల వేళ ఏడాది అంతా వ్యాపారం జరగని కంపెనీలకు కూడా ఆర్డర్ల మీద ఆర్డర్లు వచ్చి పడుతుండటంతో ప్రస్తుతం వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయల్లా వర్థిల్లుతోంది.
ఎన్నికల వేళ వీరికి చాలా డిమాండ్
భారత దేశంలో ప్రస్తుతం ఎవరికీ లేని డిమాండ్ రాజకీయ కటౌట్లు తయారు చేసేవారికి, రాజకీయ నినాదాలు రాసేవారికి, బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలు తయారు చేసేవారికి ఉంది. వీరంతా తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు పొందుతున్నారు. ఇందుకు కారణం దేశంలో జరుగుతున్న ఎన్నికలే కావడం విశేషం. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల పండగ ఈ సార్వత్రిక ఎన్నికలు. ఏకంగా 90 కోట్లు మంది ప్రజలు ఓటు వేయనున్నారు. ఈ క్రమంలోనే వ్యాపారులు చాలా బిజీ అయిపోయారు. ఇక పార్టీల ఖర్చుల వివరాలు నాయకుల ఖర్చులు దాదాపు 40శాతం పెరిగి 7 బిలియన్ డాలర్లకు చేరుకుందని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ పేర్కొంది.
వాహనాలకు బుల్లెట్ ప్రూఫ్ కోటింగ్ చేసే కంపెనీలకు డిమాండ్
ఇక రాజకీయ నాయకులు ప్రచారం చేసేందుకు వినియోగిస్తున్న వాహనాలకు బుల్లెట్ ఫ్రూఫ్ కోటింగ్ చేయిస్తున్నారు. కాల్పులు జరిగినా గ్రెనేడ్ దాడి జరిగినా వాటిని తట్టుకునేలా ఈ వాహనాలకు కోటింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాహనాలకు బుల్లెట్ ప్రూఫ్ కోటింగ్ ఇచ్చే లగ్గర్ ఇండస్ట్రీస్కు చాలా ఆర్డర్లు వచ్చినట్లు ఆ కంపెనీ డైరెక్టర్ సుంచిత్ సోబ్తీ చెప్పారు. ఈ కంపెనీ పంజాబ్లో ఉంది. ఇప్పటి వరకు 30 నుంచి 35 వాహనాలకు బుల్లెట్ ఫ్రూఫ్ కోటింగ్ ఇచ్చినట్లు తెలిపారు. ఒక్క వాహనానికి బుల్లెట్ ప్రూఫ్ కోటింగ్ చేయించాలంటే రూ. 6 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఖర్చు అవుతుంది. పూర్తి స్థాయిలో వాహనం బుల్లెట్ ప్రూఫ్గా మార్చేందుకు రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందని చెప్పారు.
నేతలకు కటౌట్లు కంటెంట్లు ఇచ్చేవారికి డిమాండ్
ఎలక్షన్ సమయంలో బాగా డబ్బులు చేసుకుంటున్నవారిలో కటౌట్లు తయారు చేసేవాళ్లు కూడా ఉన్నారు. ఓటర్లకు ఫలానా నాయకుడు ఎలాంటి లుక్తో ఉంటే ఆయనకు లబ్ది చేకూరుతుందో అలాంటి ఫోటోతో కటౌట్ తయారు చేస్తారు. ఇక ఆ నాయకుల ప్రొఫైల్ నుంచి సోషల్ మీడియా అకౌంట్ల వరకు ఈ కంపెనీలు దగ్గరుండి పర్యవేక్షిస్తాయి. ఆ నాయకుడు ప్రసంగాలను తయారు చేస్తాయి. ప్రసంగాల్లో మంచి పంచ్ లైన్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాయి. అన్ని విషయాలను చాలా జాగ్రత్త తీసుకుని ఆ నాయకుడికి ఏమి కావాలో ఏది సూటవుతుందో అనే అంశాలపై పూర్తిగా స్టడీ చేశాకే అన్నీ సిద్ధం చేస్తామని సెయింట్స్ ఆర్ట్ కన్సెల్టెన్సీ సంస్థ వ్యవస్థాపకులు సుధాంషు రాయి చెబుతున్నారు.
హెలికాఫ్టర్లకు యమ డిమాండ్
ప్రచారంకోసం నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తుంటారు. ఇందుకోసం హెలికాఫ్టర్లను వినియోగిస్తారు. నేతలకు హెలికాఫ్టర్లు స్టేటస్ సింబల్గా నిలిచాయి. ఇందుకోసమే ఎన్నికల సమయాల్లో హెలికాఫ్టర్లకు భలే గిరాకీ ఉంటుంది. సింగిల్ ఇంజిన్ చాపర్కు అయితే గంటకు రూ.1,50,000 ఉంటుంది. అదే డబుల్ ఇంజిన్ హెలికాఫ్టర్లకు అయితే రూ.2,50,000 ఉంటుందని మార్టిన్ కన్సల్టింగ్ సంస్థ వ్యవస్థాపకులు మార్క్ మార్టిన్ చెబుతున్నారు. ఇక బిజినెస్ జెట్లును అద్దెకు తీసుకోవాలంటే గంటకు రూ.4,60,000 చెల్లించాల్సి ఉంటుంది.
ప్రచారం కొత్త పుంతలు తొక్కడంతో నష్టాల బాటలో కొన్ని వ్యాపారాలు
ఒకప్పుడు ప్రచారం అంటే పార్టీ జెండాలు, టోపీలు, పోస్టర్లు, పూలమాలలు, టీషర్ట్స్ ఉండేవి. కానీ ఇప్పుడు అంతా డిజిటల్కు మారింది. సోషల్ మీడియాలో ప్రచారాలు జరిగిపోతున్నాయి. దీంతో పాత పద్ధతి ప్రచారాలకు దాదాపు కాలం చెల్లినట్లు అయ్యింది. ఈ వ్యాపారస్తులు కూడా నష్టాల్లో కూరుకుపోయారు. ప్రచారానికి కావాల్సిన మెటీరియల్ మొత్తాన్ని తాము తయారుచేసేవారమని కానీ ఇప్పుడు తమ ఖర్చులు కూడా వెళ్లడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు న్యూఢిల్లీలోని భారత్ ట్రేడింగ్ కంపెనీ యజమాని మదన్లాల్.