నాన్ వెజ్ కౌస్ : ముక్క పెడితేనే తింటామంటున్న గోవా గోవులు
గోవులు సాధారణంగా ఏం తింటాయి.. అంటే టక్కున వచ్చే సమాధానం దానా, గడ్డి, ఇతర శాఖాహారం. అందుకే గోవులను శాఖాహార జంతువులుగా పిలుస్తాం. కానీ గోవాలో మాత్రం మాంసాహార గోవులు ఉన్నాయి. అదేంటి నమ్మాలనిపించడం లేదా.. ఇది నిజం. గోవాలో కొన్ని ఆవులు మాంసాహారం తప్పనిస్తే శాఖాహారంను ముట్టకపోవడంతో అక్కడి గోశాల సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు.
ఆహారం పెడితే తీసుకోని ఆవులు
గోవుల సంరక్షణలో భాగంగా గోవా ప్రభుత్వం వీధులల్లో తిరిగే 72 ఆవులను పట్టుకుని గోశాలకు తరలించింది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే వాటికి ఆహారం ఇస్తుంటే మాత్రం తీసుకోవడం లేదట. బలవంతంగా నోట్లోకి పెట్టినప్పటికీ వెంటనే బయటకు కక్కేస్తున్నాయట. ఈ ఆవులు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాయో అర్థం కాక గోశాల సిబ్బంది తలలు పట్టుకున్నారు. ఆ తర్వాత వీరికి అసలు విషయం బోధపడింది.
మాంసాహారానికి అలవాటు పడిపోయిన గోవులు
గోవాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం నుంచి ఈ ఆవులను గోశాలకు తరలించారు. అప్పటి వరకు ఈ ఆవులు అక్కడక్కడే తిరుగుతూ మిగిలిపోయి పడవేసిన మాంసాహారం తిని దానికే అలవాటు పడిపోయాయి. వెజిటేరియన్ ఆహారంను మర్చిపోయాయి. అందుకే గోశాలలో వెజిటేరియన్ ఆహారం పెడితే అవి తినకుండా మొహం చాటేశాయనే విషయం సిబ్బందికి అర్థమైంది. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళగా వెంటనే ఆవులు మాంసాహారం నుంచి శాఖాహారంకు మారేలా చూడాలంటూ నిపుణులను రంగంలోకి దించింది.
బెంగాల్లో కూడా నాన్వెజ్ గోవులు
అయితే నాన్వెజ్ గోవులు ఉండటం ఇది తొలిసారి కాదు. 2007లో పశ్చిమబెంగాల్లో కొన్ని గోవులు బతికున్న కోడిపిల్లలను తింటూ జాతీయ స్థాయి వార్తల్లో ప్రముఖంగా నిలిచాయి. నార్త్ 24 పారగానాస్ జిల్లాలోని చాంద్పూర్లో ఈ గోవులు బతికున్న కోళ్లను తినేసేవట. కోళ్లు, గోవులను ఒకే షెడ్డులో ఉంచడంతో ఆ గోవులు కోళ్లపై దాడి చేసి వాటిని తినేసేవి. అయితే కోళ్లు అదృశ్యం అవుతుండటంతో అనుమానం వచ్చిన యజమాని ఒకరోజు వాటిపై దృష్టి సారించగా ఆయన చూస్తుండగానే గోవులు కోళ్లను తినేశాయి.
వెటిరినరీ వైద్యులు ఏం చెబుతున్నారు..?
ఆవులు పూర్తిగా వెజిటేరియన్ అని చెప్పడానికి లేదని ఓ వెటిరెనరీ డాక్టర్ చెప్పారు. అంటే గోవులు ఆయా పరిసరాలను బట్టి వాటి ఆహారపు అలవాట్లను మార్చుకుంటూ ఉంటాయని చెప్పారు. ఉదాహరణకు గడ్డి మేసే ఆవు ఆ గడ్డిలో ఉన్న పురుగులను కీటకాలను తీసి పక్కకు పారేయదు. వాటిని అలానే తినేస్తాయని చెప్పారు. కానీ ఆవులు వెజిటేరియన్ అనే భ్రమ మాత్రం చాలామందిలో ఉందని ఆ వైద్యుడు తెలిపారు.
మొత్తానికి ఈ మాంసాహారం అలవాటు ఉన్న గోవులను గోవా ప్రభుత్వం నియమించిన నిపుణులు తిరిగి వెజిటేరియన్ వైపు మళ్లిస్తారా లేదా అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచిచూడక తప్పదు.