సిక్కా ఎఫెక్ట్: మూర్తి బిలియనీర్ ట్యాగ్ గాయబ్!, వెయ్యి కోట్లు ఆవిరి..
సంస్థ వ్యవస్థాపకులు నారాయణమూర్తి, సహ వ్యవస్థాపకులు గోపాలక్రిష్ణన్ తమ బిలియనీర్ ట్యాగ్ పోగొట్టుకున్నారు.
ముంబై: ఇన్ఫోసిస్పై విశాల్ సిక్కా రాజీనామా ఎఫెక్ట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. భారీగా పతనమవుతున్న షేర్లను బై బ్యాక్ ఆఫర్ కూడా ఆదుకోకపోగా.. టాప్-10విలువైన కంపెనీల నుంచి ఇన్ఫీ చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే.
సిక్కా దెబ్బతో అటు సంస్థ వ్యవస్థాపకుల సంపద కూడా భారీగానే ఆవిరైపోయింది. ఏకంగా బిలియనీర్ ట్యాగ్ పోగొట్టుకునే స్థాయిలో ఈ నష్టం ఉందంటే ఇన్ఫోసిస్ లో ఈ పరిణామం ఎంతటి కుదుపుకు దారితీసిందో అర్థం చేసుకోవచ్చు.
బిలియనీర్ ట్యాగ్ పోయింది:
వరుసగా రెండు రోజుల నుంచి ఇన్ఫీ షేర్లు భారీగా పతనమవుతుండటంతో కంపెనీ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సహా మరో సహ వ్యవస్థాపకులు గోపాలక్రిష్ణన్ కూడా తన బిలియనీర్ ట్యాగ్ పోగొట్టుకున్నారు. సోమవారం మార్కెట్ ట్రేడింగ్ 14.5శాతం మేర క్రాష్ అవడంతో వ్యవస్థాపక ప్రమోటర్లు భారీగా తమ సంపదను కోల్పోయారు.
Recommended Video
షేర్ల పతనంతో నష్టపోయిన వ్యవస్థాపకులు:
కంపెనీ మొత్తం సంపదలో వ్యవస్థాపకుల వాటా 12.74శాతంగా ఉంది. సోమవారం నాటి షేర్ల పతనంతో వీరి సంపద విలువ భారీగా పతనమైంది. గత గురువారం 1,160 మిలియన్ డాలర్లుగా ఉన్న గోపాలక్రిష్ణన్ షేర్ల విలువ సోమవారం సాయంత్రానికి 998మిలియన్ డాలర్ల(రూ.6398కోట్లు)కు పడిపోయాయి
నారాయణమూర్తి సంపద ఆవిరి:
ఇక సంస్థ వ్యవస్థాపకులైన నారాయణమూర్తి సంపదకు కూడా భారీగానే గండిపడింది. దాదాపు రూ.1000కోట్లకు పైగా సంపద ఆవిరైపోయింది. 800మిలియన్ డాలర్లు(రూ.5,129కోట్లు)కు పైగా ఉన్న నందన్ నీలేకని సంపద కూడా 750మిలియన్ డాలర్లు(రూ.4808కోట్లు) పడిపోయింది. మొత్తంగా ప్రమోటర్లు రూ.4321కోట్లను నష్టపోయారు.
మంగళవారం కాస్త కోలుకుని..:
ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా రెండు రోజుల వ్యవధిలోనే రూ.34వేల కోట్లకు పైగా నష్టపోయింది. రూ.30వేల కోట్లుగా ఉన్న ఫౌండర్ల షేర్లు, సోమవారం సాయంత్రానికి రూ.25,594 కోట్లకు పడిపోయాయి. సిక్కా దెబ్బకు మూడేళ్ల కనిష్టానికి పడిపోయిన ఇన్ఫీ షేర్లు మంగళవారం కొద్దిగా కోలుకున్నట్లు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం స్వల్పంగా 0.11శాతం లాభపడుతూ రూ.874.30 వద్ద ట్రేడవుతోంది.