ఎన్డీఏ, యూపీఏ .. తప్పితే నెక్ట్స్ ఎవరు ? ఢిల్లీ పీఠం ఎక్కేదెవరు ? ...
న్యూఢిల్లీ : మరికొన్ని గంటల్లో దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతోంది. ఏ పార్టీ గెలుస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్ అంచనాలు తలకిందులైన సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకుంటే పరిస్థితి ఏంటీ ? హస్తినలో చక్రం తిప్పెదేవరు ? వన్ ఇండియా ప్రత్యేక కథనం.
తెరపైకి మూడో కూటమి
అన్ని ఎగ్జిట్ పోల్స్ మోదీ మరోసారి ప్రధాని పీఠం అధిష్టించబోతున్నారని తెలిపాయి. కానీ అలాకాకుండా తలకిందులైతే అన్న ప్రశ్నకు సమాధానమే ప్రాంతీయ పార్టీలు. ఆయా రాష్ట్రాల్లో మెజార్టీ ఎంపీ సీట్లు గెలిచిన రీజనల్ పార్టీ నేతలు ఢిల్లీలో చక్రం తిప్పబోతున్నారు. వారెవరో చుద్దాం. బీజేడీ అధినేత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ముందువరుసలో ఉన్నారు. వాస్తవానికి మోదీ, రాహుల్తో నవీన్ సమానదూరం పాటిస్తుండటంతో ఆయన వైఖరి ఏంటో అర్థం కావడం లేదు. 3.5 శాతం సీట్లు 18 మంది ఎంపీలతో బీజేడీ ఐదో అతిపెద్ద పార్టీగా మోడీ తొలి ప్రభుత్వంలో పనిచేసింది. ఈ ఎన్నికల్లో కూడా బీజేపీ 15 సీట్లు గెలుచుకుంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల వచ్చిన ఫణి తుఫాను సమయంలో అండగా నిలిచారు మోడీ.
మాయావతి మాయా చేస్తుందా ?
ఇక పోతే 63 ఏళ్ల దళితనేత, బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఫ్రంట్లో కీ రోల్ పోషించనున్నారు. ఈసారి ఎస్పీ, ఆర్ఎల్డీ పార్టీలతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. ప్రధాని మోదీని వ్యతిరేకించే మాయావతి .. వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేస్తున్నారు. ఒకవేళ ఎన్డీఏ, యూపీఏకు మెజార్టీ సీట్లు రాకుంటే మాయావతి చక్రం తిప్పే అవకాశం ఉన్నది. వాస్తవానికి నిన్న కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీతో మాయావతి భేటీ కావాల్సి ఉంది. కానీ మారుతున్న పరిస్థితులతో తన పర్యటనకు రద్దు చేసుకున్నారు బెహన్ జీ. ఇక చివరగా ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ పార్టీ మెజార్టీ సీట్లు సాధిస్తుందని అంచనాలు ఉన్నాయి. దీంతో ఆయన కూడా ముఖ్య భూమిక పోషించనున్నారు. మాయావతితో కలిసి చక్రం తిప్పే అవకాశాలు జోరుగా ఉన్నాయి.
దీదీ కీ రోల్
దీదీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోదీ, అమిత్ షాపై ధిక్కార స్వరం వినిపిస్తూ ముందుడుగు వేశారు. బెంగాల్లో 42 సీట్లలో మెజార్టీ సీట్లు సాధిస్తే .. బీజేపీయేతర ప్రభుత్వంలో మమత కీ రోల్ పోషించే చాన్స్ ఉంది. 1998లో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ను ధిక్కరించి .. టీఎంసీ పార్టీని మమత ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో టీఎంసీ 33 సీట్లు గెలిచి .. నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే.
జగన్ ముఖ్యభూమిక
వైసీపీ అధినేత జగన్ కూడా కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం ఉంది. జగన్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీతో సమానదూరం పాటిస్తున్నారు. తమతో కలిసి పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ కోరుతున్నా .. జగన్ మాత్రం ఆ వైపు చూడకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవానికి ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే కూటమికి జగన్ సపోర్ట్ చేస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఎన్డీఏ హామీ అమలు చేయకపోవడంతో .. యూపీఏ లేదాంటే మూడో కూటమి వైపు చూసే అవకాశం ఉంది. ఏపీలో 25 సీట్లు ఉండగా .. వైసీపీ 20 గెలుస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
స్టాలిన్ చూపు ఎటువైపో ..
డీఎంకే చీఫ్ స్టాలిన్ స్వరం కూడా ఎగ్జిట్ పోల్ అంచనాలతో మారింది. ఇదివరకు రాహుల్తో బాగున్నా .. స్టాలిన్ ఇప్పుడు అంత సంబంధాలు సరిగా లేవు. తమిళనాడులో మొత్తం 39 సీట్లు ఉండగా .. వెల్లూరులో ఎన్నిక జరగలేదు. 38 స్థానాల్లో 27 డీఎంకే గెలుస్తుందని పోల్స్ వెల్లడించాయి. దీంతో ఆయన మూడో కూటమిలో కీ రోల్ పోషించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
కేసీఆర్ కసరత్తు ..
ఐదేళ్ల క్రితం ఆవిర్భవించి అభివృద్ధిలో దూసుకెళ్తున్న తెలంగాణ రాష్ట్ర విధాత కేసీఆర్ .. కూడా నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడాలని తహతహలాడుతున్నారు. అందుకోసం ఇటీవల ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు కూడా జరిపారు. తెలంగాణలో 17 సీట్లు ఉండగా 13 వరకు టీఆర్ఎస్, ఒకటి ఎంఐఎం గెలుస్తోందని అంచనాలు ఉన్నాయి. అంటే 14 సీట్లలో కేసీఆర్ కూడా తన విభజన హామీలను నెరవేర్చుకునే అవకాశం ఉంది.