భారత్కు ఆందోళన కలిగిస్తున్న చైనా యుద్ధ వాహక నౌక చిత్రాలు!
న్యూఢిల్లీ: ఇటీవల సోషల్ మీడియాలో చైనాకు చెందిన ఓ ఫోటో చక్కర్లు కొడుతోంది. అది చైనా స్వదేశీ ఎయిర్ క్రాఫ్ట్. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఓ దీవీ సైజులో ఉండే భారీ యుద్ధ వాహన నౌకను చైనా తయారు చేస్తోంది.
తూర్పు బీజింగ్ దగ్గరలోని డాలియన్ ఓడరేవు పట్టణంలో డ్రై డాక్ యార్డ్ వద్ద టైప్ 001 ఏ యుద్ధ వాహక నౌకను చైనా నిర్మిస్తోంది. దీని బరువు అరవై వేల టన్నుల వరకు ఉంటుందని అంచనా. దీని ద్వారా 50 యుద్ధ విమానాలను ఒకేసారి తరలించవచ్చు.
రష్యా ఎస్యూ 27 అనుగుణంగా చైనా రూపొందించిన 36... జే 15 ఫైటర్ విమానాలను ఇందులో తీసుకు వెళ్లవచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయంటూ పలు ఫోటోలు బయటకు వచ్చాయి. దీని నిర్మాణం ఇంచుమించు పూర్తయినట్టు ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి.
త్వరలోనే దీనికి ట్రయల్ రన్ నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఇది పూర్తిస్థాయిలో 2020 నాటికి చైనా నేవీకి అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఇది చైనా రూపొందిస్తున్న రెండో దేశీయ యుద్ధనౌక. దీవి సైజులో ఉండే ఈ యుద్ధ నౌకలో వంతెనలు, యుద్ధ విమానయాన సౌకర్యాలు, యుద్ధ నియంత్రణ సాంకేతికత, ర్యాడర్లు, సెన్సర్లు ఇలా అత్యాధునిక హంగులన్నీ ఉంటాయి.
ఇది అందుబాటులోకి వస్తే భారత్కు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదంటున్నారు. అందుకు కారణం ఉంది. భారత్ లక్ష్యంగా చైనా దీనిని తయారు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. భారత్ను అడ్డుకునేందుకు పాకిస్థాన్, శ్రీలంక తదితర దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పుకుంటున్న చైనా.. బెలూచిస్థాన్లో ఓడరేవును నిర్మించడం ద్వారా భారత్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది.
అయితే బెలూచిస్థాన్లో ఉన్న వ్యతిరేకత కారణంగా ఇప్పట్లో ఓడరేవు నిర్మాణం పూర్తయ్యే అవకాశాల్లేవు. అదీ కాక బెలూచిస్థాన్లో ఓడరేవును నిర్మించడం ద్వారా చైనాకు భారీ వ్యయం కానుంది. అలా కాకుండా యుద్ధ వాహక నౌకను తయారు చేసి అక్కడ మోహరింపజేయడం ద్వారా ఖర్చుతోపాటు, లక్ష్యం ప్రకారం భారత్ను ఇబ్బంది పెట్టడం, పాకిస్థాన్కు నైతిక మద్దతునివ్వడం వంటి లక్ష్యాలు ఏకకాలంలో నెరవేరే అవకాశముందంటున్నారు.
అదే సమయంలో భవిష్యత్లో పాకిస్థాన్తో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ఈ యుద్ధ విమాన వాహక నౌకను ఇంకోచోట మోహరింపజేయవచ్చు. లేదా స్వదేశానికి రప్పించుకోవచ్చు. అదే సమయంలో జపాన్, ఫిలిప్పీన్స్, మయన్మార్ వంటి దేశాలను సులువుగా లొంగదీసుకోవచ్చని చైనా భావిస్తోందని అంటున్నారు.