పోలింగ్ డే: ఓటేసిన నవవధువులు, వాస్తుకు లేదని ఈవీఎంని మార్పించిన మాజీ పీఎం సతీమణి
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు నియోజకవర్గాల్లో వింతలు, విశేషాలు చోటు చేసుకుంటున్నాయి. విజయం కోసం కొందరు దైవ కార్యక్రమాలు చేస్తుండగా.. మరికొందరు వాస్తు శాస్త్రాల వెంట వెళుతున్నారు. కాగా, ఇద్దరు నవ వధువులు పెళ్లికి ముందు తమ ఓటుకు హక్కును వినియోగించుకుని ఆదర్శంగా నిలిచారు.
చాముండేశ్వరీ నియోజకవర్గం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న జేడీ(ఎస్) అభ్యర్థి జీటీ దేవెగౌడ ఓటు వేసేందుకు శుక్రవాం ఉదయం పోలింగ్ బూత్కు వచ్చారు.
వాస్తుకు లేదని ఈవీఎంను మరో చోటికి..
కాగా, పోలింగ్ బూత్ లోపలికి వెళ్లిన దేవెగౌడ భార్య చెన్నమ్మ.. ఈవీఎం యంత్రం సరైన వాస్తులో లేదని మరో చోట పెట్టాలని అధికారులను బలవంతపెట్టారు. దీంతో వారు ఈవీఎంలను వేరేచోటికి మార్చారు. ఇది అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది.
సీఎంపై పోటీ: శ్రీరాములు పూజలు
ఇది ఇలాఉండగా, ఓటు వేసేందుకు వెళ్లడానికి ముందు శ్రీరాములు తన ఇంట్లో గోపూజ చేశారు. మరికొందరు ప్రముఖులు సైతం ఓటింగ్కు ముందు ఆలయాలకు వెళ్లారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చాముండేశ్వరీతో పాటు బదామి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నారు. సిద్ధరామయ్యకు పోటీగా బీజేపీ నుంచి శ్రీరాములు బరిలోకి దిగారు. కాగా, బదామిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం అక్కడ కొంతసేపటి వరకు పోలింగ్ను నిలిపేసి ఆ తర్వాత కొనసాగించారు.
పెళ్లి కంటే ఓటేయడం ముఖ్యం..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో యువత ఓటేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. మడికెరిలోని పోలింగ్ బూత్ 131లో ఓ నవ వధువు పెళ్లి బట్టలతో వచ్చి ఓటేసింది. మొదటి ప్రాధాన్యత ఓటుకు ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. ఓటేసిన తర్వాత పెళ్లి మండపానికి ఆ నవ వధువు వెళ్లింది. ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మరో నవ వధువు కూడా..
మంగళూరులో కూడా వియోలా ఫెర్నాండెస్ అనే నవ వధువు వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేయాల్సిన బాధ్యతను మర్చిపోకూడదని ఆమె ఈ సందర్భంగా చెప్పారు. అనంతరం తన కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లి చేసుకునేందుకు బెల్తాన్గడి ప్రాంతానికి వెళ్లింది.