ఆదర్శ మహిళలు: కళ్లులేకపోతేనేమీ..భగవంతుడు ప్రతిభ ఇచ్చాడు
అహ్మదాబాద్ : కంటి చూపు అనేది భగవంతుడు ఇచ్చిన వరం. కంటి చూపు లేకుండా జీవించడం ఎంత కష్టమో వర్ణించలేము. కానీ గుజరాత్లో కొందరు కంటి చూపు లేని మహిళలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కంటిచూపు లేకపోతే నేమి... దీక్ష పట్టుదల ఉన్నాయి మాకు అని చెబుతున్నారు. వివరాల్లోకెళితే... అహ్మదాబాద్లోని అంధ్కన్య ప్రకాష్ గృహ అనే బోర్డింగ్ స్కూల్లో దాదాపు 200 మంది కంటి చూపు లేని మహిళలు జీవిస్తున్నారు. వారు ఒకరి పై ఆధారపడకుండా వారి జీవనోపాధిని వారే చూసుకుంటున్నారు. కళ్లు లేకపోతేనేమి తమకు భగవంతుడు అద్భుతమైన ప్రతిభ ఇచ్చాడని గర్వంగా చెప్తారు.
అంధ్కన్య ప్రకాష్ గృహలో ఉండే మహిళలు గత 20 ఏళ్లుగా రాఖీలు చేస్తూ వాటిని మార్కెట్లో విక్రయిస్తున్నారు. అయితే అప్పటి వరకు తమకు గుర్తింపు రాలేదని.. రెండేళ్ల క్రితం సోషల్ మీడియా విప్లవంతో తమ ప్రతిభను గుర్తించారని అక్కడి మహిళలు చెబుతున్నారు. మహిళలకు కంటి చూపు లేకపోయినప్పటికీ అద్భుతమైన రాఖీలను తయారు చేస్తున్నారని ఆ హాస్ట్ కోఆర్డినేటర్ చెప్పారు. అంతేకాదు ఈ మహిళలు చేసే రాఖీలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని చెప్పారు. సరసమైన ధరలకే రాఖీలను మార్కెట్లో అమ్ముతున్నట్లు కోఆర్డినేటర్ వివరించారు.
రాఖీలు తయారు చేయడం పూర్తవగానే... దగ్గరలోని మార్కెట్లో వీటిని అమ్ముతామని చెప్పిన కోఆర్డినేటర్... వచ్చిన డబ్బులో కొంత మహిళలకు స్టైఫండ్లా అందజేస్తామని చెప్పారు. మిగతా డబ్బుతో రాఖీలు తయారు చేసేందుకు కావాల్సిన సామగ్రిని కొంటామని వివరించారు. మహిళలు ఒక్క రాఖీలు తయారు చేయడంలోనే ప్రతిభ చాటలేదు. ఆయా పండగలకు అనుగుణంగా వాటి ప్రత్యేకతల ఆధారంగా వస్తువులను తయారు చేస్తూ ఉంటారు. ఉదాహరణకు దీపావళి పండుగకోసం దీపాలను తయారు చేస్తారు. మంచి డిజైన్లతో వాటిని తయారు చేస్తారు కాబట్టి బాగా అమ్ముడుపోతాయని చెప్పారు.