మోదీకి భయపడను, కాల్చి చంపుతారా? -నలుగురి చేతిలో దేశం నాశనం -అగ్రి చట్టాలకు పరిష్కారమిదే: రాహుల్
''ప్రధాని నరేంద్ర మోదీకో, ఇంకొకరికో నేను భయపడను. పేద రైతుల పక్షాన నేను, మా పార్టీ పోరాడుతూనే ఉంటాం. నన్నెవరూ తాకలేరు. అయితేగియితే కాల్చి చంపుతారేమో! కానీ చావును నేను భయపడను. కానీ పోరాటం నుంచి మాత్రం వెనక్కి తగ్గబోను. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం మన దేశం అత్యంత విషాద, ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. దేశం మొత్తం నలుగురైదుగురు బడాబాబుల చేతుల్లో నడుస్తోంది. ప్రభుత్వరంగ సంస్థలను ఎలా ధ్వంసం చేశారో మనమంతా చూశాం. ఆ నలుగురి కోసమే పనిచేస్తోన్న మోదీ సర్కారు.. వ్యవసాయరంగాన్ని ఖతం చేయడానికే కొత్త చట్టాలను తీసుకొచ్చింది. రైతులు నూటికి నూరు శాతం ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నారు. దేశప్రజలంతా వారికి మద్దతుగా నిలబడాలి'' అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు.
Recommended Video
ఖేతీ కా ఖూన్..
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తోన్న నిరసనలు మంగళవారంతో 55వ రోజుకు చేరింది. చర్చల పేరుతో కాలయాపన తప్ప సమస్యల పరిష్కారం దిశగా కేంద్రం వెళ్లడంలేదని ఆరోపిస్తోన్న రైతు సంఘాలు.. అవసరమైతే 2024 వరకు కూడా ఆందోళనలను కొనసాగిస్తామని కరాకండిగా చెబుతున్నారు. రైతుల నిరసనలకు మద్దతిస్తోన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ 'ఖేతీ కా ఖూన్'(వ్యవసాయరంగం హత్యకు గురైంది) పేరుతో చార్జిషీట్ రూపొందించింది. ఏఐసీపీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ బుక్ లెట్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల విషయంలో కేంద్రం తీరును తీవ్రంగా తప్పుపట్టారు.
ఆ నలుగురి చేతిల్లో దేశం..
మోదీ సర్కారు తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలతో దేశ వ్యవసాయ రంగం నాశనం అవుతుందని, ప్రధాని మోదీ తన సన్నిహితులైన నలుగురుదైదుగురు క్రోనీ క్యాపిటలిస్టులకు అనుకూలంగా ఈ చట్టాలను తయారు చేశారని, మార్కెట్ వ్యవస్థను, నిత్యావసర సరుకుల చట్టాన్ని తుంగలో తొక్కుతూ రూపొందిన కొత్త చట్టాల ద్వారా వ్యవసాయం మొత్తం ఆ నలుగురైదుగురు వ్యక్తుల చేతుల్లోకే వెళ్తుందని రాహుల్ గాంధీ చెప్పారు. ఈ విషయం..
మధ్యతరగతిపైనా భారం..
రైతులు తమ హక్కులను కాపాడుకోవడానికి కోర్టుకు సైతం వెళ్లడానికి వీల్లేకుండ చేసే అంశాలు కొత్త చట్టాల్లో ఉన్నాయని, వీటి వల్ల వ్యవసాయ రంగంలో జరిగే విధ్వంసం ఎలాంటిదో రైతులకు తెలుసుకాబట్టే వారంతా రోడ్లపైకొచ్చి పోరాటాలు చేస్తున్నారని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. కొత్త చట్టాలను ఆసరాగా చేసుకుని.. లక్షల టన్నుల ధాన్యాన్ని క్రోనీ క్యాపిటలిస్టులే నిల్వ చేసుకుంటారని, అప్పుడు మధ్య తరగతి ప్రజలపైనా విపరీతమైన భారం పడుతుందని, ధరలు ఊహించనంతగా పెరుగుతాయని ఆయన హెచ్చరించారు. కాబట్టే..
అదొక్కటే పరిష్కారం..
పంజాబ్, హర్యానా రైతులు ఈ దేశ బతుకుదెరువును కాపాడేందుకు పోరాడుతున్నారని, ఒక్కమాటలో చెప్పాలంటే ఆ రైతులు.. యావత్ దేశ ప్రజల కోసం పోరాటం చేస్తున్నారని, జనం కూడా వారికి మద్దతు ఇవ్వాలని రాహుల్ కోరారు. ప్రస్తుతం కొనసాగుతోన్న రైతుల నిరసనలకు ఏకైక పరిష్కార మార్గం.. కేంద్రం ఆ చట్టాలను వెనక్కు తీసుకోవడం మాత్రమేనని కాంగ్రెస్ నేత ఉత్ఘాటించారు.