కొత్త దందా మొదలుపెడుతారేమో... కిడ్నాపింగ్ ఇండస్ట్రీ... తేజస్విపై విరుచుకుపడ్డ నితీశ్..
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ యాదవ్కు,మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్కు మధ్య మాటల యుద్దం నడుస్తోంది. ప్రచార ర్యాలీల్లో తేజస్వి నిరుద్యోగ సమస్యను ఎక్కువగా హైలైట్ చేస్తున్న నేపథ్యంలో... అనివార్యంగా నితీశ్ కూడా దాదాపు ప్రతీ ర్యాలీలో దీని గురించి మాట్లాడుతున్నారు. తేజస్వి హామీలపై కౌంటర్ ఇస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కేబినెట్ మీటింగ్ కూడా సరిగా నిర్వహించడం రానివాళ్లు... ఇప్పుడు 10లక్షల ఉద్యోగాలిస్తామని హామిలిస్తున్నారంటూ గతంలో విమర్శించిన నితీశ్.. తాజాగా మరోసారి ఇదే అంశంపై విమర్శలు గుప్పించారు. '10 లక్షల ఉద్యోగాలంటే.. బహుశా వాళ్లే ఏదైనా కొత్త వ్యాపారం మొదలుపెడుతారేమో' అంటూ ఎద్దేవా చేశారు.
Recommended Video
'కొత్త దందా మొదలుపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు...'
సోమవారం(అక్టోబర్ 21) గయాలోని షేర్ఘాటి,ఔరంగాబాద్ రఫిగంజ్ ప్రాంతాల్లో నితీశ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 'కొంతమంది వ్యక్తులు ఉంటారు... ఏమీ తెలియకపోయినా ఉద్యోగాలిస్తామని హామీలిస్తారు. 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెబుతున్నారు. అంత డబ్బు ఎక్కడినుంచి వస్తుంది. ఉద్యోగాలిస్తామన్న పేరుతో వాళ్లు సొంత వ్యాపారం(కామ్ దందా) మొదలుపెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. పరిస్థితులను అర్థం చేసుకోకుండా... ఎలాంటి అనుభవం లేకుండా... కేవలం మాటలు చెప్పడం అర్థం లేనితనం...' అని నితీశ్ తేజస్విని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు.
మహిళల కోసం ఆర్జేడీ ఏం చేసింది...
తాము అధికారంలోకి వస్తే 10లక్షల ఉద్యోగాలిస్తామని చెప్తున్న ఆర్జేడీ... గతంలో 15 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని నితీశ్ ప్రశ్నించారు. కానీ జేడీయూ హయాంలో దాదాపు 6లక్షల పైచిలుకు మందికి ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. తేజస్వి తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన 15 ఏళ్ల పాలనలో మహిళల అభివృద్ది కోసం ఏం చేశారని ప్రశ్నించారు. లాలూ జైలుకు వెళ్లగానే తన భార్యను ముఖ్యమంత్రి చేశాడు తప్ప మహిళల కోసం ఏమీ చేయలేదన్నారు. అదే జేడీయూ హయాంలో తాము మహిళలకు రిజర్వేషన్లు కల్పించామన్నారు.
కిడ్నాపింగ్ ఇండస్ట్రీ...
లాలూ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు కూడా సరిగా లేవని... అప్పుడంతా కిడ్నాపింగ్ ఇండస్ట్రీ హవా నడిచిందని విమర్శించారు. ఆ భయానికి చాలామంది డాక్టర్లు,వ్యాపారవేత్తలు రాష్ట్రం వదిలి పారిపోయారన్నారు. కనీసం రోడ్లు,విద్యుత్ సౌకర్యం కూడా లేవని... ఆర్జేడీ పాలన ఆటవిక పాలనను తలపించిందని విమర్శించారు. కానీ తాము అధికారంలోకి వచ్చాక అంతా మారిపోయిందని... బీహార్ అభివృద్ది కోసం చాలా కృషి చేశామని అన్నారు. ప్రతీ ఒక్కరికీ రక్షణ కల్పించామన్నారు. ప్రతీ ఇంటికీ విద్యుత్ సదుపాయం,ప్రతీ గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించామన్నారు. అవినీతిని,నేరాలను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని... ఇటీవలి నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్టులో బిహార్ 26వ స్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. తాము అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలో నేరాలు తగ్గాయన్నారు.
మళ్లీ అవకాశం ఇస్తే...
'మీరు మళ్లీ మాకు అవకాశం ఇస్తే... రాష్ట్రంలో ప్రతీ పంట పొలానికి సాగు నీరు అందిస్తాం. అసలు రాష్ట్రంలో ఎక్కడా కరువే లేకుండా చేస్తాం. ఇప్పటికే అన్ని గ్రామాల్లో,అన్ని పల్లెల్లో విద్యుత్ సదుపాయం కల్పించాం. రానున్న రోజుల్లో ప్రతీ గ్రామానికి సోలార్ విద్యుత్ అందిస్తాం. ప్రతీ 8-10 గ్రామ పంచాయతీలకు ఒక వెటర్నరీ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తాం.' అని నితీశ్ హామీ ఇచ్చారు. కాగా,అక్టోబర్ 28న మొదలవనున్న బీహార్ ఎన్నికల్లో మొత్తం మూడు దశల్లో జరగనున్న సంగతి తెలిసిందే. నవంబర్ 10న ఫలితాలు వెలువడుతాయి.