ఇంట్లో మహిళలు, కూతుళ్లపై అత్యాచారం చేసి చంపేస్తారు: బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. పలువురు బీజేపీ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు మరువక ముందే మరో బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ కాంట్రవర్శీ కామెంట్స్ చేశారు. ఢిల్లీలోని షాహీన్బాగ్లో సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరతీసేలా ఉన్నాయి.
ఓ న్యూస్ ఏజెన్సీకి ఇంటర్వ్యూ ఇచ్చిన ఎంపీ పర్వేష్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో ఓటు వేసే ప్రజలు ఒకసారి ఆలోచించి ఓటు వేయాలని అన్నారు. షాహీన్బాగ్లో సీఏఏకు వ్యతిరేకంగా లక్షల మంది గుమికూడారన్న వర్మ... వారంతా మీ ఇళ్లల్లోకి ప్రవేశించి మహిళలను, కూతుళ్లపై అత్యాచారంకు తెగబడి హత్య చేస్తారనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "ఈ రోజు సమయం ఉంది. రేపు ఏమైనా జరిగితే మోడీ లేదా అమిత్ షా కాపాడేందుకు రారు... అందుకే ఆలోచించి ఢిల్లీ ప్రజలు ఓటు వేయాలి" అని అన్నారు.
#WATCH: BJP MP Parvesh Verma says, "...Lakhs of people gather there (Shaheen Bagh). People of Delhi will have to think & take a decision. They'll enter your houses, rape your sisters&daughters, kill them. There's time today, Modi ji & Amit Shah won't come to save you tomorrow..." pic.twitter.com/1G801z5ZbM
— ANI (@ANI) January 28, 2020
ఇక ఢిల్లీలోని ఓ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన వర్మ... ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే సీఏఏపై వ్యతిరేకంగా షాహీన్బాగ్లో నిరసనలు చేస్తున్న వారిని ఒక్క గంట సమయంలో క్లియర్ చేయిస్తామని చెప్పారు. అంతేకాదు ఢిల్లీ ఎన్నికలను దేశ సమగ్రత కోసం జరిగే ఎన్నికలుగా చూడాలని అన్నారు. ఫిబ్రవరి 11వ తేదీన ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన గంటలోపే షాహీన్బాగ్లో నిరసనకారులు కనిపించకుండా చేస్తామని చెప్పారు పర్వేష్ వర్మ. ఇక తాము అధికారంలోకి వచ్చిన ఒక నెలలోపే ప్రభుత్వ భూముల్లో నిర్మితమైన మసీదులను కూల్చివేసేలా చర్యలు తీసుకుంటామని తన నియోజకవర్గ ప్రజలకు చెప్పారు పర్వేష్ వర్మ.
అంతకుముందు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్న వారంతా ద్రోహులని పేర్కొంటూ వారిని కాల్చిపారేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విపక్ష పార్టీల పై ధ్వజమెత్తిన అనురాగ్ ఠాకూర్... జాతి విద్వేష పూరిత వ్యాఖ్యలను చేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. తను చెప్పడమే కాకుండా సభకు వచ్చిన వారితో కూడా నినాదాలను పలికించారు అనురాగ్ ఠాకూర్.