రైల్లో పారిపోయిన దొంగ... పట్టుకునేందుకు విమానంలో వెళ్లిన పోలీసులు... చివరికిలా...
ఓ పనిమనిషి తాను పనిచేస్తున్న ఇంటికే కన్నం వేశాడు. ఆ ఇంటి నుంచి విలువైన నగలను చోరీ చేశాడు. దొంగతనమైతే చేశాడు గానీ... ఆ నగల పెట్టెను మాత్రం తెరవలేకపోయాడు. సర్లే,సొంతూరుకి వెళ్లాక చూసుకుందామని రైలెక్కగా... అతను రైల్వే స్టేషన్ బయట అడుగుపెట్టేసరికి పోలీసులు బేడీలతో సిద్దంగా ఉన్నారు. కోల్కతాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని జేపీ నగర్లో ఉండే రాజేష్ బాబు అనే రియల్ ఎస్టేట్ బిల్డర్ ఇంట్లో పశ్చిమ బెంగాల్లోని బుర్ద్వాన్కి చెందిన కైలాష్ దాస్ అనే వ్యక్తి ఆరేళ్లుగా పనిచేస్తున్నాడు. ఈ ఆరేళ్లలో అతను చాలా నమ్మకంగా పనిచేయడంతో ఎప్పుడు ఎలాంటి వివాదం తలెత్తలేదు. ఇదే క్రమంలో ఇటీవల రాజేష్ బాబు కుటుంబ సభ్యుల్లో ఒకరికి కరోనా వైరస్ సోకింది. దీంతో అతని కుటుంబమంతా పేషెంట్ ఆరోగ్యం పైనే ఫోకస్ పెట్టింది. ఆ సమయంలో ఇంటి వ్యవహారాలను ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడంతో కైలాష్ దాస్కి దుర్బిద్ది పుట్టింది.
ఆ ఇంట్లో ఓచోట బంగారు ఆభరణాలు దాచిన ఎలక్ట్రానిక్ సేఫ్ పరికరాన్ని దొంగిలించాడు. వాటి విలువ దాదాపు రూ.1.3కోట్లు ఉంటుంది. చోరీ అనంతరం అతను మైసూరు పారిపోయాడు. అక్కడ ఓ లాడ్జిలో దిగిన అతను... స్క్రూడ్రైవర్తో ఆ ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఓపెన్ చేసేందుకు విఫలయత్నం చేశాడు. దీంతో ఇక లాభం లేదనుకుని... లాడ్జి ఖాళీ చేసి బెంగాల్లోని సొంతూరు బయలుదేరాడు. ఇందుకోసం తిరిగి బెంగళూరు వచ్చి హౌరా వెళ్లే యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ ఎక్కాడు.
అప్పటికే నగల చోరీపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు బెంగళూరు రైల్వే స్టేషన్లో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అతని కదలికలను గుర్తించారు. యశ్వంత్ పూర్ ఎక్స్ప్రెస్లో అతను హౌరా వెళ్తున్నాడని తెలుసుకుని... అతని కంటే ముందే అక్కడికి చేరేలా పోలీసులు విమానంలో బయలుదేరారు. మొత్తానికి కైలాష్ హౌరా రైల్వే స్టేషన్లో దిగి బయటకు అడుగు బయటపెట్టేసరికి పోలీసులు ఎదురుపడ్డారు. దీంతో కైలాష్ తప్పించుకునే ప్రయత్నం చేయగా.. అతన్ని వెంబడించి పట్టుకున్నారు. అనంతరం హౌరా నుంచి బెంగళూరుకు తరలించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.