మూడో రోజు సోను సూద్ ఆస్తులపై ఐటీ తనిఖీలు; సూద్ భారీగా పన్ను ఎగవేశారా.. అసలేం జరుగుతుంది ?
బాలీవుడ్ ప్రముఖ నటుడు, సామాజిక సేవలతో రియల్ హీరోగా గుర్తించబడిన సోను సూద్ ఆస్తులపై ఐటీ తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదాయపు పన్ను శాఖ మూడో రోజున కూడా ముంబైలోని సోను సూద్ నివాసంలో తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. సెప్టెంబర్ 15 న ముంబైలో సోనూసూద్ కు సంబంధించిన ఆరు ప్రదేశాలలో ఐటి అధికారులు సర్వే కార్యకలాపాలు నిర్వహించారు. సెప్టెంబర్ 16 న, నిన్న ఐటీ అధికారులు మళ్లీ సోను సూద్ నివాసానికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. ఈ రోజు, 3 వ రోజు (సెప్టెంబర్ 17), అధికారులు సోను సూద్ యొక్క ముంబై నివాసం మరియు మహారాష్ట్రలోని నాగపూర్, జైపూర్లోని ఇతర ఆస్తులను ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు.
సోను సూద్ కోసం రాజకీయ పార్టీల వెంపర్లాట .. బెల్లం చుట్టూ ఈగల్లా; ఐటీ తనిఖీలతో భారీ పొలిటికల్ రచ్చ
సోను సూద్ ఆస్తులపై సెప్టెంబర్ 15 నుండి కొనసాగుతున్న తనిఖీలు
సోను సూద్ పైన నజర్ పెట్టిన ఐటి అధికారులు సెప్టెంబర్ 15 న సోను సూద్కి సంబంధించిన ఆరు ప్రాంగణాల్లో సర్వే కార్యకలాపాలను నిర్వహించారు. ముంబై, హైదరాబాద్, ఢిల్లీ లో ఉన్న సోను సూద్ ఆస్తులను పరిశీలించారు. ఐటి అధికారులు సోను సూద్ తో ఒప్పందాలు చేసుకున్న ఇతర సంస్థల ఖాతా పుస్తకాలు, ఆదాయం, వ్యయం మరియు ఇతర ఆర్థిక రికార్డులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. నిన్న కూడా నిర్వహించిన తనిఖీల్లో లక్నోలో రియల్ ఎస్టేట్ సంస్థతో సోనూసూద్ చేసుకున్న ఒప్పందానికి సంబంధించిన వివరాలపై అధికారులు ఆరా తీశారు.
ముంబై నివాసంతో పాటు నాగపూర్, జైపూర్ లో ఏకకాలంలో సోదాలు
ఇక తాజాగా మూడోవ రోజు ముంబైలోని సోనూసూద్ నివాసంతో పాటు, నాగపూర్, జైపూర్ లో ఏకకాలంలో సోదాలు కొనసాగిస్తున్నారు. అయితే ఈ తనిఖీలలో భారీ మొత్తంలో పన్ను ఎగవేతను గుర్తించారని సమాచారం. బాలీవుడ్ నుంచి తీసుకున్న పేమెంట్లు, సోను సూద్ వ్యక్తిగత ఆదాయంలో పన్ను ఎగవేతను గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో సూద్ చారిటీ ఫౌండేషన్ బ్యాంకు ఖాతాలను కూడా ఐటి అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న తనిఖీలపై ఈరోజు సాయంత్రం ఐటీ అధికారులు మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.
సోను సూద్ పై ఐటీ తనిఖీలను సీరియస్ గా ఖండిస్తున్న అభిమానులు , రాజకీయ పార్టీలు
ఏదేమైనప్పటికీ సోను సూద్ ఆస్తులపై ఐ-టి డిపార్ట్మెంట్ సెర్చ్ చేయడం ప్రారంభించిన తర్వాత, అతని అభిమానులు ట్విట్టర్లో #IstandWithSonuSood ట్రెండ్ చేయడం ద్వారా సోను సూద్ కు తమ మద్దతును ప్రకటించారు. ఆయన రియల్ హీరో అని, పేదలకు సహాయం చేసిన గొప్ప వ్యక్తి అని, పేదల పాలిట సోనుసూద్ దేవుడని అభివర్ణించారు. ఇక రాజకీయ పార్టీలు సోను సూద్ పై కొనసాగుతున్న ఐటీ తనిఖీలపై మండిపడుతున్నాయి. బీజేపీ కావాలనే సోను సూద్ ను టార్గెట్ చేస్తుందని, తమకు అనుకూలంగా లేని వారిని బెదిరించే క్రమంలోనే కేంద్ర సంస్థలను ఉపయోగిస్తుందని బీజేపీపై శివసేన, ఆప్, కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తున్నాయి.
కరోనాసమయంలో సేవలతో ప్రజల మనసుల్లో సోను సూద్
సోను సూద్ కరోనా మహమ్మారి బారిన పడి దేశం తీవ్ర సంక్షోభంలో ఉన్న సమయంలో నిరుపమానమైన సేవలు చేశాడని, వలస కార్మికుల ను వాళ్ల ఇళ్లకు తరలించడానికి ఆయన దేవుడిగా మారాడని ప్రజలందరూ కితాబిచ్చారు . ఏప్రిల్ 2020 లో కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం విధించిన మొదటి లాక్డౌన్ సమయంలో, సోను సూద్ దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వలస కార్మికులు వారి ఇళ్లకు చేరుకోవడానికి రవాణా ఏర్పాటు చేయడమే కాకుండా, కోవిడ్ -19 తో బాధపడుతున్న వ్యక్తులకు హాస్పిటల్ పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు మరియు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ లు వంటి సదుపాయాలను కల్పించి సోను సూద్ ఎంతో మంది ప్రజల ప్రాణాలను కాపాడారు. అందుకే ఇప్పుడు సోనుసూద్ పై ఐటి అధికారులు తనిఖీలు చేస్తుంటే ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది.